మన దేశంలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు తీపి కబురు. లాక్ డౌన్ నేపథ్యంలో సేవల కోసం అందుబాటులోకి వచ్చిన విధానం ఇకముందు కూడా అమలు కానుంది. లాక్డౌన్ వల్ల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం ఉత్తమ ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇదే రీతిలో ఆఫీసు కార్యకలాపాలు సైతం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి 2.60 లక్షల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వనుంది. 20 ఏళ్ల నాటి ఆపరేటింగ్ మోడల్ను పూర్తిగా మార్చి ఆఫీసులను తక్కువ స్టాఫ్తో నడపాలని నిర్ణయించింది. ఇండియాలో టీసీఎసే అతిపెద్ద ఐటీ కంపెనీ కాబట్టి మిగతా ఐటీ కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయి.
విపరీతమైన ట్రాఫిక్ ఉండే మెట్రో నగరాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో టీసీఎస్ తన విధానాలను సమీక్షించింది. ప్రస్తుతం టీసీఎస్కు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఇప్పుడు 20 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తుండగా, 2025 నాటికి వీరి సంఖ్యను 75 శాతానికి పెంచాలని టీసీఎస్ కోరుకుంటోంది. అంటే 2.62 లక్షల మంది ఇంటి నుంచే పని చేస్తారు. ఆఫీసులకు 25 శాతానికి మించి ఉద్యోగులు రావాల్సిన అవసరం లేదని, మిగిలిన వాళ్లంతా ఇంటి నుంచే పని చేయవచ్చని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్రమణియం అన్నారు.
సెక్యూర్ బోర్డర్లెస్ వర్క్ స్పేస్ (ఎస్బీడబ్ల్యూఎస్) టీసీఎస్ విధానంలో పనిచేయించింది. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విధానంలో ఇప్పటికే 35 వేల మీటింగ్స్ నిర్వహించారు. 40,600 కాల్స్, 340 లక్షల మెసేజ్లు వెళ్లాయని సీఈఓ, ఎండీ రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. అందుకే ఇక నుంచి 75 శాతం మంది ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేయించాలని కంపెనీ నిర్ణయించింది. టీసీఎస్ విధానాన్ని ఇన్ఫోసిస్, విప్రో వంటివి అనుసరించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. లాక్డౌన్ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ విధానం భవిష్యత్తులో సైతం అందుబాటులోకి రావడం పట్ల టెక్కీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.