భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక దృష్టి సారించిన ప్రధామంత్రి నరేంద్ర మోదీ సర్కారు కోవిడ్-19 మహమ్మారి సోకిన వ్యక్తులను కనిపెట్టి, అప్రమత్తమయ్యేలా కేంద్రం ఓ అప్లికేషన్ ను రూపొందించింది. అటువంటి కేసులను సమర్థవంతంగా ట్రాక్ చేసేందుకు "ఆరోగ్య సేతు" పేరుతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ యాప్ అనుకోని వివాదంలో చిక్కుకుంది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఆరోగ్యసేతు యాప్ వాడకానికి వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, దీంతో వ్యక్తిగత గోప్యత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ క్లారిటీ ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ సేతు యాప్ను వినియోగిస్తే అందులో వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంటుందని, అది వారి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగిస్తుందని ఓవైసీ పేర్కొన్నారు. అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్న కరోనా వైరస్ను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చప్పట్లతోను, దీపాలతోను.. చివరికి ఏ మాత్రం నమ్మదగినదిగా లేని ఆరోగ్యసేతు మొబైల్ యాప్తోను ఎదుర్కోవాలని చూడడం దురదృష్టకరమని అసదుద్దీన్ ఆరోపించారు.
దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ క్లారిటీ ఇస్తూ, అరోగ్యసేతు యాప్ పూర్తిగా శాస్త్రీయబద్ధమైన సాధనమని తెలిపారు. ఆరోగ్యసేతు యాప్ దేశంలో కరోనాపై శాశ్వత విజయం సాధించేవరకు కొనసాగుతుందని మంత్రి జవదేకర్ తెలిపారు. వ్యక్తిగత గోప్యతకు వచ్చిన ముప్పేమీ లేదని, ఈ యాప్ ద్వారా మనం కరోనా బారినపడకుండా కాపాడుకునే అవకాశం దక్కుతుంది తప్ప ఏ ఇతర సమస్య ఉండదని ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం ప్రపంచమంతా ఆరోగ్యసేతు యాప్ను ఎంచుకుంటోందని కేంద్రమంత్రి చెప్పారు. కరోనా సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే ఈ యాప్ అప్రమత్తం చేస్తుందని ఆయన తెలిపారు. నిజానికి ఆరోగ్యసేతు యాప్ కోసం పెద్దగా సేకరిస్తున్న వివరాలు ఏమీ లేవని, దగ్గు, జలుబు, లేదా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితేనే ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి వివరించారు.