ప్రాణాంతక మహమ్మారి కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలన్నీ కుదేలైపోవటంతోపాటు వ్యక్తిగతంగా కూడా కోట్లమంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మనదేశంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. కోట్లమంది రోజుకూలీలు ఉపాధి కోల్పోయారు. ఇప్పడు చిన్నచిన్న కంపెనీలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సమజంగానే అందరి చూపు అప్పుపై పడుతుంది. అలా అప్పు పొందాలనుకునే పీపీఎఫ్ ఖాతాదారులకు ఆ సంస్థ శుభవార్త అందించింది.
కరోనా, లాక్డౌన్ కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అనేక ఆఫర్లు, వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. అదే బాటలో పీపీఎఫ్ సంస్థ కూడా ఈ కరోనా కష్టకాలంలో ఖాతాదారులకు కొన్ని వెసులుబాటు కల్పించింది. పీపీఎఫ్ పై తక్కువ శాతం వడ్డీతో లోన్ తీసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే, ఇందుకు కొన్నిషరతులు విధించింది. పీపీఎఫ్ బ్యాలెన్స్పై లోన్ తీసుకోవచ్చని, పీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించిన మూడో ఏడాది నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే మూడేళ్ల నుంచి 6 ఏళ్ల మధ్యలో మాత్రమే లోన్ తీసుకోవడానికి అర్హులని ప్రకటించింది. ఒకవేళ అకౌంట్ తెరిచి 6 ఏళ్లు దాటితే అప్పుడు పీపీఎఫ్ అకౌంట్ నుంచి ముందుగానే డబ్బులు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అయితే పీపీఎఫ్ అకౌంట్పై లోన్ తీసుకున్నవారికి మాత్రం వడ్డీ లభించదు. పైగా తీసుకున్న రుణానికి 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పీపీఎఫ్ ఖాతాపై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండగా ఇది వర్తించదు. లోన్ తీసుకుంటే మాత్రం 1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక బ్యాంకుల విషయానికి వస్తే, తమ విలువైన కస్టమర్లను కష్టసమయంలో ఆదుకొనేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకు వచ్చాయి. దేశంలో బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వరంగ బ్యాంకులదే 80శాతం వాటా. దాంతో కస్టమర్లను కాపాడుకొనేందుకు చర్యలు చేపట్టాయి. కస్టమర్లకు ప్రత్యేక అత్యవసర లోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు మిగతా వాటి కంటే ముందుగా ప్రకటించాయి.