రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రంగా చెప్పబడే తమిళనాడులో రోజు రోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. మొన్న తాజాగా తీసిన వైన్ షాపుల దెబ్బో ఏమో తెలీదు కాని… కొద్ది రోజులుగా వరుసగా వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో హై కోర్టు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిపివేసింది.
గురువారం 580 మందికి కరోనా పాజిటివ్ రాగా.. శుక్రవారం ఒక్క రోజే 600 కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ నమోదైన కేసుల్లో 399 ఒక్క చెన్నైలోనివే. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,009కి చేరింది.
ప్రస్తుతం 4361 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్. కాగా, ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో చెన్నైలోనే 3,043 ఉన్నాయి. అందులో చెన్నై కోయంబేడు మార్కెట్లోనే 1,589 కేసులు వచ్చాయి. నిన్న సంభవించిన మూడు మరణాలతో.. చనిపోయిన వారి సంఖ్య 40కి చేరింది.
ఇదిలా ఉండగా అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన గుజరాత్ రాష్ట్రంలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. రోజుకి ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు వదులుతున్న వారు అధికంగా ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 390 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈరోజు కరోనా వల్ల 24 మంది మృతి చెందగా.. మొత్తం 449 మంది కోవిడ్-19తో మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది.