దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో 1,326 కరోనా కేసులు నమోదు కాగా 472 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 822 మంది ఇప్పటికే రికార్డ్ అయ్యారు. 32 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నా హైదరాబాద్లో మాత్రం కరోనా విజృంభణ చూపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్ లోనే 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ఈ రోజు ఇప్పటికే 20 కేసులు కేవలం ఒక్క హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి. వారం రోజుల కరోనా పాజిటివ్ల సంఖ్య తగ్గడంతో అటు అధికారులే కాకుండా ఇటు భాగ్యనగర్ వాసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే చాప కింద నీరులా వైరస్ విస్తరిస్తుంది.
ముఖ్యంగా చార్మినార్ జోన్లోని మలక్పేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్ జోన్లు కరోనాకు హాట్ స్పాట్స్గా మారాయి. అసిఫ్నగర్, చాదర్ఘాట్, తలాబ్కట్ట భవానీనగర్, రెయిన్ బజార్ లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ లింకులు, లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన వారి కారణంగానే ఇక్కడ కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. ఎల్బీనగర్ జోన్ లోని ద్వారకానగర్, సాయినగర్, సచివాలయ కాలనీల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. నాగోల్, లింగోజిగూడ, హుడా సాయినగర్లో కాలనీలో కేసులున్నాయి. చాలామందికి కరోనా ఎలా సోకిందనే లింక్ తెలియడం లేదు. సరిగా ప్రైమరీ కాంటాక్ట్లకు టెస్ట్లు చేయకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ లో ముఖ్యంగా హాట్ స్పాట్ లు గా మారిన ప్రాంతాలలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.