కరోనా వ్యాప్తిని నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంలో దేశవ్యాప్తంగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 51 రోజుల తర్వాత గత మంగళవారం నుంచి 15 ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతకుముందు నుంచే వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లు ప్రత్యేకంగా వేసింది. సాధారణ రైలు సేవలు మినహా మిగతా సేవలు ఈ రకంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ రైల్వే సర్వీసులకు సంబంధించి పలు షరతులు ఉన్నాయని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వలస కూలీల విషయానికి వస్తే, గురువారం వరకు 800 శ్రామిక్ రైళ్లు సుమారు 10 లక్షల మంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేరవేశాయని రైల్వే విభాగం వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శ్రామిక్ రైల్లు ఎక్కాలంటే తాము అంతిమంగా వెళ్లే గమ్యం ఏమిటో కార్మికులు వెల్లడించాల్సిందేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. టిక్కెట్లు బుక్ చేసే సమయంలోనే తాము చేరుకునే చిరునామాను ఇవ్వాలని నిబంధన విధించింది. ఆన్లైన్లో టికెట్లు అమ్మే ఐఆర్సీటీసీ ఆ చిరునామాలను నమోదు చేసుకుంటుంది. కరోనా క్లస్టర్ ఏదైనా వెలుగు చూస్తే సంబంధిత మనుషులను వెదికి పట్టుకోవడం సులభమవుతుంది అని రైల్వే శాఖ ప్రతినిధి చెప్పారు.
ఇదిలాఉండగా, ప్రత్యేక రైల్ల విషయంలో రైల్వే అందిస్తున్న సేవలు ఫలిస్తున్నాయి. రాష్ర్టాల రాజధానుల నుంచి ఢిల్లీకి ప్రయాణికుల ప్రత్యేక రైళ్లను మే 12 నుంచి కేంద్ర ప్రభుత్వం నడుపుతోంది. గత మంగళవారం నుంచి 15 ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లను ప్రభుత్వం నడుపుతుండగా వీటికి సంబంధించిన టికెట్లను మే 11 తేదీ నుంచి అమ్మడం ప్రారంభించింది. ఈ ఏసీ రైళ్లకు సంబంధించింది ఇప్పటివరకు 2,34,411 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారని రైల్వే శాఖ ప్రకటించింది. తద్వారా రూ.45.30 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. కరోనాకు లాక్డౌన్ ముందు, లాక్డౌన్ కాలంలో జూన్ 30 వరకు రిజర్వ్ చేసుకున్న అన్ని టికెట్లను రైల్వే విభాగం రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. వాటికి సంబంధించిన పూర్తి సొమ్మును వాపసు చేయనున్నట్లు తెలిపారు. 15 జతల ప్రత్యేక రైళ్లకు మాత్రం బుకింగ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.