లాక్ డౌన్ నిబంధనలు, అనంతరం వెలువడిన సడలింపుల నేపథ్యంలో కేంద్రం తీరు చర్చనీయాంశంగా మారింది. నాల్గవ దశ లాక్డౌన్ ఇప్పటి వరకు ఉన్నదానికంటే బిన్నంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా నేటి నుంచి అమలులోకి వస్తున్న నాల్గవ దశ లాక్డౌన్ మార్గదర్శకాలను వెల్లడించింది. అయితే, ఇందులో వెలలువడిన ఓ నిబంధనలు చిత్రంగా ఉన్నాయని అంటున్నారు.
లాక్డౌన్ 4.0 సమయంలో సిగరేట్, పాన్షాప్లు తెరవడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మద్యం, సిగరేట్, పాన్షాప్లు గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో తెరిచే ఉండగా వీటిపై కంటైన్మెంట్ జోన్లలో తెరవడం నిషేదం కొనసాగుతుంది. అయితే, పాన్ షాప్లు తెరిచినపుడు...పాన్లు, గుట్కాలు కొనుగోలుకు అవకాశం దొరుకుతుంది. దీంతో సహజంగానే ఉమ్మివేస్తారు. కానీ అలా ఉమ్మేసిన వారికి ఫైన్ విధిస్తారట. నిబంధనల సడలింపు సర్కారే ఇచ్చి...క్రమశిక్షన పాటించని వారికి సర్కారే ఫైన్ వేస్తుందన్నమాట. ఈ నిబందనలు చిత్రంగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలాఉండగా, లాక్ డౌన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార పదార్థాలను హోం డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చింది. అయితే, హోటళ్లు, రెస్టారెంట్లపై నిషేధం కొనసాగుతోంది. మెట్రో రైళ్లు, విద్యా, శిక్షణ సంస్థలు మే 31 వరకు బంద్ అని తెలిపిన కేంద్రం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు సైతం నిలిపివేత కొనసాగుతోందని పేర్కొంది. ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల మధ్య వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. బార్బర్ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు ఓపెన్ చేసేందుకు అనుమతి కల్పించారు. సినిమా థియేటర్లు, దేవాలయాలు మూసివేత కొనసాగింపు ఉంటుంది. రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగింపు ఉంటుంది. స్విమ్మింగ్ పూల్స్, జిమ్లు, మే 31వరకు బంద్ ఉండాల్సిందే. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉండగా, భౌతిక దూరం పాటిస్తూ 50 మంది అతిథులతో పెళ్లిళ్లకు అనుమతి ఇచ్చారు.