ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విశ్వరూపం దాల్చుతోంది. పేద.. ధనిక, చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అందరికీ కరోనా భయపెడుతోంది. దీంతో ప్రస్తుతం ప్రపంచదేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు వ్యాప్తిచెందింది. అలాగే రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యతో ఆయా దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇక కరోనా ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది.
మరోవైపు కరోనా గురించి కొత్త కొత్త బయట పడడంతో.. ప్రజల్లో భయం మరింత పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే.. ఈ వైరస్ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ, ఇటీవల కరోనా కారణంగా హార్ట్ అటాక్ కు గురవుతున్న కేసులు పెరిగిపోతుండడంతో ఈ మహమ్మారి వైరస్ గుండెను కూడా దెబ్బతీస్తోందని గుర్తించారు. గతంలో హృదయ సంబంధ సమస్యలు ఉన్నా, లేకపోయినా... కరోనా సోకిన తర్వాత మాత్రం వారిలో గుండె పనితీరు కూడా ఎఫెక్ట్ అవుతోందిని వైద్యులు గుర్తించారు.
అది కూడా ముఖ్యంగా గుండె కండరాలను కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తున్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అంతేకాదు, కేరళలో కరోనా కారణంగా సంభవించిన మొదటి మరణంలోనూ హార్ట్ ఫెయిల్యూర్ జరిగినట్టు వైద్యులు గుర్తు చేశారు. ఇక చైనా, అమెరికా, యూరప్ దేశాల్లోనూ కరోనా ఇదే తరహాలో దెబ్బతీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనాతో చనిపోయిన వారిలో 45 నుంచి 55 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్, ఆపై మయో కార్డైటైటిస్ సమస్యలు ఏర్పడినట్టు పరిశోధకులు తెలిపారు. ఇక ఈ తరహా గుండె సమస్యలు వచ్చిన కరోనా రోగుల్లో కేవలం 3 శాతం మందే బతికి ఉండడం గమనార్హం.