ఇకపై జరిగే పార్లమెంట్ సమావేశాలు కొత్తరకంగా ఉండొచ్చు..! లోక్సభ, రాజ్యసభ సమావేశాల తీరు మారిపోవచ్చు..! ఓ రోజు లోక్సభ, మరో రోజు రాజ్యసభ సమావేశాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పార్లమెంట్ సమావేశాలను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చ మొదలైంది. స్పీకర్ ఓం బిర్లాతో పాటు, ఛైర్మన్ వెంకయ్యనాయుడు దీనిపై కసరత్తు మొదలుపెట్టారు.
కరోనా కాలంలో అన్నీ మారిపోతున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ పేరుతో కొత్త లైఫ్ స్టైల్కు అలవాటుపడుతున్నాం. కరోనా పూర్తిగా దూరమవుతుందన్న సంకేతాలైతే కనుచూపుమేరలో లేవు. అందుకే కరోనాకు దూరంగా ఉంటూనే.. సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా కారణంగా భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ సమావేశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సమావేశాల తీరు తెన్నులను మార్చేసి పార్లమెంట్ కాంప్లెక్స్లో రద్దీ తగ్గించే దిశగా కసరత్తు మొదలయ్యింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు.. దీనిపై ఇప్పటికే సమాలోచనలు మొదలు పెట్టారు.
కరోనా కారణంగా బడ్జెట్ సమావేశాలు మార్చిలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి. వచ్చే నెలలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఒక్కసారి పార్లమెంట్ సమావేశాలు మొదలైతే... పార్లమెంట్ భవనం మొత్తం వేలాది మందితో నిండిపోతుంది. లోక్సభ రాజ్యసభ ఎంపీలతో పాటు, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా....ఇలా అందరూ పార్లమెంట్ కాంప్లెక్స్ చుట్టూ తిరుగుతారు. దీని వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే లోక్సభ రాజ్యసభ సమావేశాలను ఒకేరోజుకాకుండా... ఒక రోజు లోక్సభ...మరుసటి రోజు రాజ్యసభ భేటీ అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెక్నాలజీని వాడుకోవడం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తున్నారు. లోక్సభ సమావేశాలను పార్లెమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం కోసం దీనిని నిర్మించడంతో విశాలంగా ఉంటుంది. లోక్సభ సమావేశాలను ఇక్కడ నిర్వహిస్తే.. సభ్యుల మధ్య సోషల్ డిస్టెన్సింగ్ కూడా సాధ్యమవుతుంది. ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్న చాంబర్లోకి రాజ్యసభను మార్చే ఆలోచన కూడా ఉంది. ఇలాంటి ప్రతిపాదనను గతంలోనే డీఎంకే ఎంపీ చేశారు. స్టాండింగ్ కమిటీ సమావేశాలను కూడా ఇకపై వర్చువల్గా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. కరోనా భయంతో సభ్యులు రావడానికి నిరాకరించడంతో బుధవారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ భేటీని వాయిదా వేశారు.