దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం మొదటి విడత లాక్ డౌన్ విధించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు అన్నీ మూసివేయబడ్డ విషయం తెలిసిందే. సరిగ్గా పరీక్షలకు ముందు విద్యాసంస్థలు మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నో పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. పదో తరగతి పరీక్షలు వచ్చే నెలలో నిర్వహిస్తామని అంటున్నారు. అంతేకాకుండా పాఠశాలలను కూడా ఆగస్టు నెలలో ప్రారంభిస్తామని చెబుతుంది కేంద్ర ప్రభుత్వం. జూలైలో విద్యా సంస్థలు పున ప్రారంభానికి సంబంధించినటువంటి విధివిధానాలను సిద్ధం చేస్తామని చెబుతున్నది ప్రభుత్వం.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఆన్లైన్ పిటిషన్ దాఖలయింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. ఆన్లైన్ పిటిషన్ పై ఏకంగా నాలుగు లక్షల మంది తల్లిదండ్రులు కూడా సైన్ చేశారు. కరోనా వైరస్ పోయే దాకా పిల్లలను స్కూల్ కి పంపించం అంటూ చెబుతున్నారు తల్లిదండ్రులు. ఇది ఎక్కువగా కర్ణాటక మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండగా తెలంగాణ లో కూడా కొంతమంది ఆంధ్రలో కూడా కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు సైన్ చేశారు. కరోనా వైరస్ ప్రస్తుతం ఆస్పత్రిలో కార్యాలయాలలో సైతం వ్యాపిస్తుందని ఈ నేపథ్యంలో.. విద్యా సంస్థల్లో విద్యార్థుల మధ్య సామాజిక దూరం పాటించాలి అని చెప్పినప్పటికీ విద్యార్థులు మాత్రం పాటించడం సాధ్యం కాదు అని ఆరోపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు.
అంతే కాకుండా చిన్న పిల్లలకు ఎక్కువగా వైరస్ వ్యాపిస్తుంది అనే కారణంతో తమ పిల్లల కరోనా వైరస్ పూర్తిగా తగ్గేవరకు స్కూల్ కి పంపించం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు విద్యాసంస్థలు తెరవద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికోసమే ఆన్లైన్లోకి పిటిషన్ దాఖలు చేశారు. అయితే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు మాత్రం ఇలాంటి వాటి జోలికి పోవడం లేదు కానీ ఎగువ మధ్యతరగతి వాళ్లు వీరిని కూడా ఒప్పించే పనిలో పడ్డారని తెలుస్తోంది. మరి ఇలాంటి సున్నితమైన సమస్య పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది విద్యార్థుల తల్లిదండ్రుల్లో రానున్న రోజుల్లో ఏమైన మార్పు వస్తుందా చూడాలి మరి.