కరోనా కలకలంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పెద్ద ఎత్తున దెబ్బ పడిన సంగతి తెలిసిందే. అనేక దేశాల్లో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధిపై సైతం అదే రీతిలో దెబ్బ పడింది. ఇలాంటి వారి విషయంలో తెలంగాణ సర్కారు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే నిర్మాణ రంగంలోని అవకాశాలు చేరువ చేసేందుకు సంకల్పించింది. లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి తిరిగొచ్చిన తెలంగాణకు చెందిన నిర్మాణ రంగ కార్మికుల కోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఓ ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. ఉపాధి కోసం చూసే కార్మికులకు, భవన నిర్మాణ సంస్థలకు మధ్య వెబ్సైట్ వారధిలా పనిచేస్తుంది.
బార్బెండింగ్, మేస న్స్, ఎలక్ట్రిషియన్స్, ప్లంబర్స్, ఫాం వర్క్ కార్పెంటర్స్ తదితర వృత్తుల్లో న్యాక్ ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందవచ్చు. కార్మికుల కోసం న్యాక్ రూపొందించిన వెబ్సైట్లో గల్ఫ్ దేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల న్యాక్ ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగం వెతుక్కోవడం తెలియక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి ఈ వెబ్సైట్ దారి చూపుతుంది. వెబ్సైట్ వల్ల భవన నిర్మాణరంగ కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కంపెనీలు తమకు అవసరమైన కార్మికులను వెబ్సైట్ నుంచి ఎంపిక చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఈ వెబ్సైట్ను గృహ నిర్మాణం, ఆర్అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.వెబ్సైట్ ప్రాముఖ్యతపై కలెక్టర్లు, సర్పంచ్లు, మండల అధికారుల ద్వారా ప్రభుత్వమే అవగాహన కల్పిస్తుందని చెప్పారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్మికులకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇందుకోసం స్కిల్ మ్యాపింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు. సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి చాలామంది కార్మికులు అవసరమన్నారు. ఎంతోమంది వలస కార్మికులు రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉండటం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు పలు సూచనలు చేశారు.