క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు అక్కడికక్కడే వాటికి పరిష్కారాలు చూపేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి జగన్మోహన్రెడ్డి త్వరలోనే పల్లెబాట పట్టనున్నారని తెలుస్తోంది. ఈమేరకు గురువారం స్వయంగా ముఖ్యమంత్రే తాను గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. ముఖ్యమంత్రి గురువారం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, సేవలు, మౌలిక సదుపాయాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా తాను త్వరలోనే గ్రామాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాకే ఉంటుందని తెలిపారు. అయితే ఎన్ని రోజులు ఉంటుంది..ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పాల్గొంటారు..వంటి అంశాలను త్వరలోనే సంబంధిత అధికారులు వెల్లడిస్తారని సమాచారం. మొత్తంగా ఎన్నికలకు ముందు జగన్మో్హన్రెడ్డి పాదయాత్రతో జనంలోకి వెళ్లినట్లుగా....ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతూ జనం బాగోగులను తెలుసుకునేందుకు రాష్ట్రంలో అమలవుతున్న పథకాల అమలు తీరును పరిశీలించేందుకే ఈ కార్యక్రమం చేపట్టారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నారు. సీఎం నిర్ణయంతో పార్టీ శ్రేణుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.ఇదిలా ఉండగా పల్లెబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తమతమ జిల్లాల నుంచి మొదట పాల్గొనేలా చూడాలని వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారట.
ఇదిలా ఉండగా గురువారం ముఖ్యమంత్రి సమీక్షించిన అంశాల్లో అధికారులకు పథకాల అమలుపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పథకాల అమలులో ఎలాంటి వివక్ష పాటించకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి లబ్ధి చేకూరాలని పేర్కొన్నారు. మనకు ఓటేయకపోయినా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అవినీతి, వివక్ష లేకుండా పారదర్శకంగా పథకాలు అందేలా చూడాలన్నదే ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. నిర్దిష్ట గడువులోగా వివిధ పథకాలు లబ్ధిదారులకు అందాలని సూచించారు. అర్హత గల ఎవరి దరఖాస్తులను కూడా ఎటువంటి సరైన కారణం లేకుండా తిరస్కరించరాదని పేర్కొన్నారు. ముఖ్యంగా పెన్షన్, ఇళ్ల పట్టాలు, ఆరోగ్య శ్రీకార్డు, రేషన్ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలని చెప్పారు.