కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ అనతి కాలంలోనే దేశదేశాలు వ్యాప్తిచెంది.. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కంటికి కనిపించని ఈ అతిసూక్ష్మజీవి.. మానవుడి మనుగడకే పెద్ద గండంగా మారింది. లాక్డౌన్ను అమలు చేస్తున్నా.. ఆ ప్రాణాంతక వైరస్కు అడ్డుకట్ట పడకపోగా.. రోజురోజుకు మరింత వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువలో నిలిచింది.
అదే సమయంలో మరణాల సంఖ్య నాలుగు లక్షలు దాటేసింది. వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంతకర వైరస్ను అంతమొందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనడంలో నిమగ్నమయ్యారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు దేవతగా మారిపోయింది. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. కరోనా వైరస్ను దేవతగా కొలుస్తున్న కేరళలోని కడక్కల్కు చెందిన వ్యక్తి.. వైరస్ బారినపడి పోరాడుతున్న వారిని రక్షించాలంటూ ప్రతి రోజూ పూజలు చేస్తున్నాడు. వైరస్ను కరోనా మాతగా మార్చిన ఆ వ్యక్తి పేరు అనిలన్.
అయితే అనిలన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే అనిలన్ ఇదంతా చేస్తున్నాడని మండిపడుతున్నారు. మరోవైపు ప్రపంచదేశాలను తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కరోనాకు ఇలా పూజలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, విమర్శలకు తాను వెరవబోనని, తాను చేస్తున్నది సరైనదేనని అనిలన్ చెప్పడం గమనార్హం. కాగా, ఇటీవల జార్ఖండ్ లోని ధన్ బాద్ సమీపంలో ఉన్న ఝరియా ప్రాంతంలో పదుల సంఖ్యలో మహిళలు, ట్రాన్స్ జెండర్లు చేరి పూజలు చేశారు. కరోనా మాత పేరుతో భజనలు కూడా చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించగా..కరోనా మాత కలలో కనిపించి.. పూజలు చేస్తే ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్లిపోతానని చెప్పారు.