అసలే కరోనా కష్టకాలం.. ఓ వైపు ఉపాధి లేదు.. ఆదాయం లేదు.. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజల నుంచి ఎంత వీలైతే అంత పిండుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 9 రోజుల్లో 5 రూపాయల మేర పెట్రో ధరలు పెంచడమే ఇందుకు కారణం.. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఆర్భాటాలకు పోయిన ప్రభుత్వానికి.. ఇప్పుడు ప్రజలే ఆదాయ వనరుగా కనపడినట్లున్నారు. ఎలాంటి సంక్షోభం వచ్చినా ప్రజల నుంచి పిండుకోవడమే మార్గంగా ఎంచుకున్నారు.. పెట్రో ధరలు పెరగడమంటే.. నిత్యావసరాల ధరలు పెంచడమే..! తాజాగా మరోసారి పెరిగిన పెట్రో ధరలు ప్రజలపాలిట శాపంగా మారాయి.
దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మార్చి 16 నుంచి.. డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని నిలిపివేసిన ఆయిల్ సంస్థలు... మళ్లీ బాదుడు షురూ చేశాయి. గత ఆదివారం నుంచి పెంచుతూ పోతున్నాయి. హైదరాబాద్లో పెట్రోలు ధర గత నాలుగు రోజుల్లో 2 రుపాయల85 పైసలు పెరిగింది. మరో వారంలో 5 నుంచి 6 రుపాయలు పెరిగే అవకాశం ఉందని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెబుతోంది. సెప్టెంబరు నెలాఖరుకు నాటికి పెట్రో ధరలు 85 రూపాయలకు చేరే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ఇంధన వాడకం పెరిగింది. దేశవ్యాప్తంగా వాహనాల రాకపోకలు గణనీయంగానే పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. దీంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. డైనమిక్ ప్రైసింగ్ ప్రకారం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గితే మనకు కూడా తగ్గాలి. కానీ, వినియోగదారులకు ఆ లాభం అందకుండా కేంద్రం ఎప్పటికప్పుడు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది మార్చి 14న లీటరుకు 3 రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. లాక్డౌన్ దెబ్బకు చమురు అమ్మకాలు పడిపోవడంతో.. ఆదాయాన్ని పెంచుకునేందుకు మళ్లీ మే మొదటివారంలో పెట్రోలుపై 10 రూపాయలు, డీజిల్పై 13 రూపాయల మేర సుంకాన్ని పెంచింది. దీని ద్వారా కేంద్రానికి అదనంగా 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.
గత నెల 6న ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో ఢిల్లీలో పెట్రోలు 71 రూపాయలు దాటింది. అందులో పెట్రోలు అసలు ధర.. కేవలం 18 రూపాయలు మాత్రమే. ఎక్సైజ్ డ్యూటీ 32 రుపాయలుండగా, డీలర్ కమీషన్ 3 రూపాయలు, వ్యాట్ 16రుపాయలు కలిపితే మొత్తం 71 రుపాయలకు చేరింది. ఈ లెక్కన ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై ఏస్థాయిలో బాదుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని నిజాయతీగా అమలు చేసి అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధర తగ్గినప్పుడల్లా ఆ లాభాన్ని ప్రజలకు బదలాయిస్తే.. పెట్రో ధరలు కనీసం ఇప్పుడున్న ధరల కన్నా 30 రూపాయల వరకు తక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో వంటగ్యాస్ సిలిండర్ల ధరలూ పెరగనున్నాయి. జూన్ 1న పదకొండు రుపాయల మేర గ్యాస్ ధర పెరిగింది. మున్ముందు గ్యాస్ ధరలు ఇంకా పెరగనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయ్. పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు సామాన్యుల పాలిట పెను భారంగా మారాయి. కేంద్రం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో వాహనాలు మళ్లీ రోడ్డెక్కాయి. దీంతో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఊపందుకున్నాయ్. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మొదలైంది. వారం వ్యవధిలోనే విశాఖలో 4 నుంచి 5 రూపాయలు పెరిగాయి. ఇప్పుడు ఏకంగా లీటరు పెట్రోల్ 78 రూపాయలకు చేరింది. దీంతో సామాన్యులు వాహనాలు నడపాలంటేనే భయపడుతున్నారు.
ఇటు హైదరాబాద్ లో కూడా పెట్రో ధరలు కొండెక్కాయి. ఇప్పటికే లాక్ డౌన్ తో ఆర్థికంగా నష్టపోయిన సామాన్యులకు పెట్రో ధరలు భారంగా మారాయి. పెట్రోల్...డీజిల్ ధరల పెంపుపై మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ మండిపడ్డారు. ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఆ మేరకు ఎందుకు తగ్గలేదని ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించి కమల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలపై మరింత భారాన్ని వేసేలా కేంద్రం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ముడి చమురు ధరల పెరుగుదలను కారణంగా చూపిస్తూ గతంలో పెట్రో ధరలు పెంచుతూ పోయిందని తెలిపారాయన. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని చెప్పారు. ఇప్పటికైనా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తే నిత్యావసర వస్తువుల ధర తగ్గి ప్రజలపై ఆర్థిక భారం తొలగిపోతుందని సూచించారు. దానికి విరుద్ధంగా కేంద్ర, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్.