కర్మ సిధ్ధాంతం నమ్మాలా అంటే పడిపోయిన వాడు, చితికిపోయిన వాడు తప్పకుండా నమ్ముతారు. అదే జోరు మీద ఉన్నవాడు, విజయాలు వరసగా వరిస్తున్న వారు అసలు పట్టించుకోరు. అయితే కర్మ ఎవరికైనా కర్మే. అది తన పని తాను చేసుకుంటూపోతుందని అంటారు. సెంటిమెంట్లు ఎక్కువగా ఉండే రాజకీయాల్లో కర్మను నమ్మేవారూ ఉన్నారు, ఇపుడు ఇదంతా ఎందుకంటే గత పాపాలే శాపాలుగా మారి టీడీపీని కట్టి కుదుపుతున్నాయా అన్న డౌట్లు వస్తున్నాయట.
లేకపోతే చంద్రబాబు ఎలాంటి నాయకుడు. సరిగ్గా ఏడాది క్రితం ఆయన ముఖ్యమంత్రిగా యమ దూకుడు మీద ఉన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీని సైతం తర్జనితో బెదిరించిన చరిత్ర బాబుది, మరో వైపు కేసీయార్ తో కయ్యం పెట్టుకుని మీకూ ఏసీబీ ఉంటే మాకూ ఏసీబీ ఉందంటూ గర్జించిన గొంతు అంది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిదేళ్ల జమానాలో ఆవేశం
వచ్చిందంటే పట్టలేకపోయేవారు.
చూపుడు వేలు చూపిస్తూ మీ అందరి జాతకాలు నా వద్ద ఉన్నాయి. తోకలు కట్ చేస్తానంటూ హెచ్చరించేవారు. చంద్రబాబు ఆలోచనల్లో ఆయన ప్రణాళికల్లో చూస్తే టీడీపీ ఎప్పటికీ ఓడిపోకూడదు, అందుకే ఆయన 2050 వరకూ తన పార్టీ అధికారంలో ఉంటుందని యాక్షన్ ప్లాన్ రూపొందించారు కూడా. 2029 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఆంధ్రా ఉంటుందని, 2050 నాటికి ప్రపంచంలో ఉంటుందని కూడా ఎపుడూ చెబుతూ ఉండేవారు, పార్టీలో అదే నినాదంగా చేసేవారు.
అటువంటి బాబు ఇపుడు తన పార్టీ మనిషిని చూడాలంటే ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండెంట్ పర్మిషన్ అడుగుతున్నారు. ఆంధ్రా రావాలంటే అనుమతించండి అంటూ కరోనా లాక్ డౌన్ వేళ దరఖాస్తు చేస్తున్నారు. బాబు ఇపుడు నేల మీద ఉన్నారు. వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఏసీబీ తన పక్కన లేదని కూడా అర్ధం చేసుకుంటున్నారు. ఎవరినైతే బెదిరించి తోకలు కట్ చేస్తానన్నారో ఇపుడు ఆయన వారి ఏలుబడిని చూస్తూ నిట్టూరుస్తున్నారు. ఇవన్నీ చూసినపుడు అనిపించేది ఒక్కటే. కర్మ సిధ్ధాంతం ఒకటి ఉందని.
బాబు అయినా మరే పెద్ద బాబు అయినా ఇదే స్థితి ఉంటుందని, అది దాని పని తాను చేస్తుందని, ఓడలు బళ్ళు అయిన వేళ మాత్రమే కర్మను గుర్తించగలమంటారు. ఇపుడు టీడీపీలో దాని మీదనే చర్చ సాగుతూండాలి మరి.