కర్నాటకలో హూవినహడగలి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరమేశ్వర్ నాయక్ వివాహ వేడుక వివాదాస్పదంగా మారింది. వేడుకకు పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించాల్సి ఉండగా వందలాది మంది వివాహానికి హాజరయ్యారు.పరమేశ్వర్ నాయక్ వివాహం సోమవారం బళ్లారి జిల్లా లక్ష్మిపురలో వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలు అమలులో ఉండటంతో 50 మందికి మించకుండా పెళ్లి చేసుకుంటామని పర్మిషన్ తీసుకొని రూల్స్ బ్రేక్ చేశారు. ఈ పెళ్లికి కర్ణాటక హెల్త్ మినిస్టర్ బి. శ్రీరాములుతో పాటు మాజీ సీఎం సిద్ధరామయ్య, మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర లాంటి పెద్ద లీడర్లు హాజరయ్యారు.
పెళ్లికి హాజరైన ప్రముఖులు కనీసం మాస్కులు కూడా ధరించకపోవడం విశేషం. ప్రముఖులకు ఒక రూల్...ప్రజలకు ఒక రూల్ ఉంటుందా.. అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భౌతికదూరం పాటించడం లేదని తిట్టిపోస్తున్నారు. హెల్త్ మినిస్టర్ గా ఉండి కనీసం మాస్క్ కూడా కట్టుకోని శ్రీరాములు వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వివాహ వేడుకకు దాదాపు 800 మందికి పైగా హాజరైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువే ఉంటారని మీడియాలో కథనాలు వచ్చాయి. పెళ్లికి వచ్చిన వారిలో సగం మందికి పైగా మాస్క్ లు పెట్టుకోలేదని పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని బళ్లారి కలెక్టర్ ఎస్. ఎస్ నకుల్ చెప్పినా...అది సాధ్యం కాదని, కేవలం అధికారులు నిబంధనలు ప్రజలకే అమలు చేయడానికి యత్నిస్తున్నారని, పెద్దోళ్లు ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోవడం లేదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తూర్పారబడుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 81.07 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.38 లక్షల మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 41.87 లక్షల మందిఇంటికి చేరుకున్నారు. భారత్లో మొత్తం 3లక్షల 32వేల 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,69,798 మంది డిశ్చార్జ్ కాగా , 9,520 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,53,106 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.