మన పొరుగు దేశమైన పాకిస్థాన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? దుర్మార్గానికి, కుట్ర పనులకు ఆ దేశం కేరాఫ్ అడ్రస్. సందర్భం ఏదైనా ఆ దేశం వ్యవహరించే తీరు అదే. అయితే, ఇప్పుడు దానికి మరో దేశం తోడయింది. అదే చైనా. కీలకమైన సమయంలో ఈ రెండు దేశాల తీరు వివాదాస్పదంగా మారింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి తన వక్రబుద్ధిని చాటుకున్నది. కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ అర్థంలేని ఆరోపణలు చేసింది. ఇక చైనా సంగతి చూస్తే, లడాఖ్లోని గాల్వన్ వ్యాలీలో జరిగిన చైనా సైనిక ఘర్షణకు పాల్పడింది. భారత్కు చెందిన ముగ్గురు సైనికులు మృతిచెందారు. దాంట్లో ఓ కల్నల్ కూడా ఉన్నారు.
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశంలో భాగంగా కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న మానవహక్కుల సంక్షోభాన్ని ప్రస్తావించి, దాని పరిష్కారాలపై చర్చించాల్సిన వేదికను రాజకీయం చేసేందుకు ప్రయత్నించింది. కశ్మీర్లో మానవహక్కులు అంటూ గగ్గోలు పెట్టింది. అయితే, పాకిస్థాన్ ఆరోపణలను భారత్ దీటుగానే తిప్పికొట్టింది. ఐరాసలో భారత రాయబారి సెంథిల్ కుమార్ పాక్ వైఖరిని ఉదాహరణలతో సహా వివరిస్తూ ఎండగట్టారు. కిడ్నాప్లు, మతమార్పిళ్లు, హత్యలు, ఉగ్రవాద క్యాంపులకు అడ్డాగా మారిన ఓ దేశం భారత్ లాంటి సహజ శాంతియుత దేశానికి నీతులు చెప్పడం సరికాదన్నారు. UNHRC వేదికను దుర్వినియోగం చేయడమనే సంప్రదాయాన్ని పాకిస్థాన్ ఇప్పుడు కూడా కొనసాగించిందని విమర్శించారు. దక్షిణాసియా దేశాల్లో నరమేధాన్ని ప్రోత్సహిస్తున్న ఏకైక దేశమైన పాకిస్థాన్.. మానవహక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. పాకిస్థాన్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తరచూ జరుగుతున్న దాడుల గురించి సెంథిల్ కుమార్ ప్రస్తావించారు. సంకుచిత రాజకీయ అజెండా కోసం UNHRC లాంటి అంతర్జాతీయ వేదికలను వాడుకోవడం ప్రమాదకరమని సెంథిల్ కుమార్ హెచ్చరించారు.
ఇక చైనా విషయానికి వస్తే, ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మీడియాతో మాట్లాడుతూ లడఖ్ సరిహద్దు వద్ద భారత బలగాలు హద్దు మీరినట్లు ఆరోపించారు. భారత సైన్యం దూకుడు ప్రదర్శించిందని, దాని వల్లే రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొందని ఆరోపించారు. భారత్ తమ బలగాలను హద్దుల్లో పెట్టుకోవాలని, ఏకాభిప్రాయానికి తగినట్లు ఉండాలని జావో సూచించారు. గాల్వాన్ వ్యాలీలో జరిగిన తాజా ఘర్షణలో.. రెండు దేశాలకు చెందిన సైనికులు మృతిచెందారు. అయితే చైనా బలగాల్లో ఎంత మరణించిన దానిపై క్లారిటీ లేదు. తొలుత అయిదుగురు చైనా సైనికులు మరణించినట్లు వార్తలు వచ్చినా.. వాటిని ఆ దేశం కొట్టిపారేసింది. కానీ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. మరోవైపు ఫ్రంట్లైన్ దళాలు తమ భూభాగంలోకి రాకూడదంటూ చైనా విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది. బోర్డర్ లైన్స్ ఎట్టి పరిస్థితుల్లో దాటవద్దని పేర్కొంది.