అంతర్జాతీయ స్థాయిలో భారత్కు తిరుగులేదని నిరూపితమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఎన్నికల్లో మనదేశం సత్తా ఏంటో చూపించింది. ఈ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి కోసం సభ్య దేశాలతో కలిసి పని చేస్తామని ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో ఇండియా ఘన విజయం సాధించింది. ఆసియా ఫసిపిక్ వర్గానికి చెందిన శాశ్వత సభ్యదేశంగా భారత్ మరోసారి గెలుపొందింది. ఐక్యరాజ్యసమితి తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈ విజయం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
2021-22 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆసియా-పసిఫిక్ రీజన్ నుంచి భారత్ నాన్ పర్మినెంట్ మెంబర్గా మరోసారి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 193 సభ్యదేశాలున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్కు అనుకూలంగా 184 దేశాలు ఓటు వేయడం విశేషం. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో 15 శక్తివంతమైన దేశాలు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ రీజన్లో చైనా, పాకిస్తాన్తో పాటు 55 సభ్య దేశాలు ఉన్నాయి.
ఇక...ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోడి హర్షం వ్యక్తం చేశారు. భద్రతా మండలిలో భారత్కు మద్దతు తెలిపిన యావత్ ప్రపంచదేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచశాంతి, సమానత్వం నెలకొల్పడంలో సభ్యదేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని ప్రధాని సోషల్ మీడియాలో వెల్లడించారు.
ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశాలుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఉన్నాయి. ఐతే, శాశ్వత సభ్యదేశాలు కాని సభ్యుల కోసం ప్రతిరెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. దీనిలోభాగంగానే జరిగిన ఎన్నికల్లో భారత్ భారీ మద్దతు సాధించింది. భారత్తో పాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందాయి. కెనడా మాత్రం ఓటమి పాలైంది.