కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఐఏడీఎంకే ఎమ్మెల్యే కె. పళనికి కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే కె.పళని ప్రస్తుతం ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వారం క్రితం కరోనాతో డీఎంకే ఎమెల్యే అన్బళగన్ మృతి చెందారు. భారత్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 13,586 మందికి కొత్తగా కరోనా సోకింది.
ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 336 మంది మరణించారు. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,04,711 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,80,532కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 12,573 కి పెరిగింది. 1,63,248 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కరోనా వైరస్ మహమ్మారి తమిళనాడు రాష్ట్రాన్ని అతలా కుతలం చేస్తోంది.
ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కేపీ అన్ బలగాన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో మంత్రి చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యే జే అన్ బజాగాన్ కు కరోనా సోకడంతో చనిపోయారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే కే పళనికి కూడా కరోనా సోకింది. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా నివారణ చర్యలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాతే మంత్రికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. సమీక్షలో పాల్గొన్న మిగతా వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నార్త్ చెన్నై పరిధిలో ఈ కమిటీ పర్యవేక్షణ చేసింది.