దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన సూర్యగ్రహణం ముగిసింది. గుజరాత్లోని ద్వారకలో మొదలై చివరిగా అసోంలోని డిబ్రూఘర్ లో 3 గంటలకు పరిసమాప్తమైంది. ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభమైన సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూర్తిస్థాయిలో కనువిందు చేసింది. సూర్యుడి మధ్య భాగాన్ని చంద్రుడు కప్పేశాడు. దాంతో సూర్యుడు ఓ వలయ రూపంలో దర్శనిమిచ్చాడు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న సమయాల్లో సూర్యగ్రహణం కనిపించింది.
సూర్యగ్రహణం సందర్భంగా ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేసింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తొలుత భారత్లో గుజరాత్లోని ద్వారకలో గ్రహణం కనిపించింది. ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో సూర్యుడు సాక్షాత్కరించాడు. రాజస్తాన్లోని జైపూర్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైంది. దేశంలోని కొన్ని భాగాల్లో ఇది వలయాకారంలో కనిపించింది. అక్కడ ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు అగ్ని వలయాన్ని చూశారు. దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో పాక్షిక సూర్య గ్రహణం మాత్రమే కనిపించింది. రాజస్థాన్లోని సూరత్గఢ్, అనూప్గఢ్, హరియాణాలోని సిర్సా, రతియా, కురుక్షేత్ర, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, చంబా, చమేలీ, జోషీమఠ్ ప్రాంతాల్లో అగ్ని వలయం ఒక నిమిషం పాటు కనువిందుచేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉ. 9 గంటల 16 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభం భారత్లో 10 గంటల 14 నిమిషాలకు పూర్తిస్థాయిలో కనిపించిన గ్రహణం మధ్యాహ్నం 3 గంటల 4 సెకన్ల వరకు కనిపించిన సూర్యగ్రహణం
ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9 గంటల 16 నిమిషాల నుంచి సూర్యగ్రహణం ప్రారంభమైంది. భారత్లో మాత్రం 10 గంటల 14 నిమిషాలకు పూర్తి స్థాయిలో గ్రహణం కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల 4 సెకన్ల వరకు సూర్యగ్రహణం కనిపించిందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇక...తెలంగాణలో ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 44 నిమిషాల వరకు 51 శాతం, ఏపీలో ఉదయం 10 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 49 నిమిషాల వరకు 46 శాతం కనిపించిందని శాస్త్రవేత్తలు వివరించారు. గ్రహణం కారణంగా భూమి మీద పడే అతి నీలలోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ కొంతమేర నశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరులో మరోసారి సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మళ్లీ 2022లో సూర్యగ్రహణం ఏర్పడుతుందని వెల్లడించారు.