ఇప్పుడు అందరి దృష్టి చైనా పైనే. గల్వాన్ వద్ద మన సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి 20 మంది మన జవాన్లను అసువులు బాసేందుకు కారణమైన ఈ దేశంపై ప్రజలంతా రగిలిపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే మన ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అదే సమయంలో మన జవాన్లు సైతం చైనాకు తగు బుద్ధి చెప్తున్నారు. లఢక్ సరిహద్దులో చైనాతో ఘర్షణ నేపథ్యంలో ప్రత్యేక పర్వత దళాలను భారత్ రంగంలోకి దించింది. పశ్చిమ, మధ్య, తూర్పు చైనా సరిహద్దుల్లోని 3,488 కిలోమీటర్ల మేర విస్తరించిన నియంత్రణ రేఖ వెంబడి ఈ ప్రత్యేక దళాలను ఆర్మీ మోహరించింది. మరోవైపు, భారత సైన్యం చైనా సైనికులపై ప్రతిదాడి చేసింది. దీంతో ఆ దేశ సైన్యం భయపడి తమ భూ భాగంలోకి పరుగులు తీసింది. ఈ క్రమంలో వారిని వెంబడిస్తూ వెళ్లిన భారత సైనికులు 10 మంది చైనా సైనికులకు బందీలుగా చిక్కారు.
తాజా ఘటన గురించి మన సైనికులు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. సరిహద్దులో ఉత్కంఠ సమయంలో చైనా పలువురు ఖైదీలను బందీలుగా చేసుకుంది. వారి చెర నుంచి విడుదలైన భారత జవాన్లకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులకు పైగానే చైనా సైనికలు చెరలో బందీలుగా ఉనా.. వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. భారత సైన్యం ప్రతి దాడి చేస్తుందని చైనా ఊహించలేదని, మనం ఒకేసారి దాడి చేయడంతో వారు బయపడి పారిపోయారని విడుదలైన వారు తెలిపారు.
మరోవైపు, హిమాలయ పర్వతాల్లోని ఎత్తైన శిఖరాలు ఆవరించిన ఈ సరిహద్దు ప్రాంతాలను కాపాడుకోవడం, ఇక్కడ గస్తీ నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఈ నేపథ్యంలో ఈ సరిహద్దుల్లోని క్లిష్టమైన కొండ ప్రాంతల్లో పోరాడేందుకు గత పదేండ్లుగా ఓ ప్రత్యేక పర్వత దళానికి భారత ఆర్మీ శిక్షణ ఇస్తున్నది. ఉత్తరాఖండ్, లఢక్, గూర్ఖా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింకు చెందిన పర్వతారోహకుల నిఫుణులతో కూడిన బృందాలకు సైనిక శిక్షణ ఇస్తున్నారు. కొండలు, లోయల్లో శత్రువులను లక్ష్యంగా చేసుకుని ఆయుధాలు, రాకెట్లు ప్రయోగించడంలో వీరు ట్రైనింగ్ పొందుతారు. గొరిల్లా యుద్ధ విద్యలోనూ ఆరితేరుతారు. ఉత్తరంలోని సైనిక శిబిరాల్లో ఉండే ఈ దళాన్ని తాజాగా ఎర్ర జెండాలను ఎగురేసిన చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ మోహరించింది. దీంతో చైనా నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా దీటుగా తిప్పికొట్టగలమన్న సంకేతాన్ని ఇచ్చినట్లయ్యింది. కాగా, గతంలో కార్గిల్ యుద్ధంలో భారత్ విజయానికి ఈ ప్రత్యేక పర్వత దళాలు ఎంతో శ్రమించాయి.