ప్రదానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు ఒకటి. నల్లధనం అరికట్టేందుకు ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం ఫలితం ఎంత మేరకు ఇచ్చిందో తెలియదు కానీ...ఈ చర్యతో అనేకమంది ఇబ్బందులు పడ్డారు. దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దాన్ని తలదన్నే మరో ప్రతిపాదన...పెద్ద నోట్ల రద్దును మించే ఆగ్రహాన్ని పుట్టించే సిఫార్సు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ వీజీ కన్నన్ నేతృత్వంలో ఏర్పాటైన ఓ కమిటీ సంచలన ప్రతిపాదనలు చేసింది.
గత ఏడాది అక్టోబర్లోనే ఆర్బీఐకి అందించిన ఈ రిపోర్టు ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఈ రిపోర్ట్ వివరాలు బయటపడ్డాయి. అయితే, ఆ ప్రతిపాదనలు ప్రజలకు అత్యంత ఆగ్రహాన్ని కలిగించేవిగా ఉన్నాయంటున్నారు. రూ. ఐదు వేలు కంటే ఎక్కువగా విత్డ్రా చేసే ప్రతి ట్రాన్సాక్షన్పై ఛార్జీని వసూలు చేయాలని ఆర్బీఐ కమిటీ ప్రతిపాదించింది. ఉచిత లావాదేవీలు ఉన్నప్పటికీ వ్యక్తులు రూ. 5 వేలు కంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేస్తే బ్యాంకులు ఛార్జీలను వసూలు చేయాలని ఈ కమిటీ రికమండ్ చేసింది. ఏటీఎంల నుంచి పెద్ద మొత్తంలో విత్డ్రాయల్స్ను తగ్గించేందుకు ఈ ఛార్జీల పెంపుదల ఉపయోగపడుతుందని ఈ కమిటీ అంచనా వేస్తోంది.
ఇక పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న సెంటర్లలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్పై ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీని రూ. 2 లు పెంచి రూ. 17 కు తీసుకురావాలని పేర్కొంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లయితే ఈ ఛార్జీని రూ. 7 కు పెంచాలని సిఫార్సు చేసింది. గ్రామీణ ప్రాంతాలు, సెమి అర్బన్ ప్రాంతాలలో ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీని రూ.3లు పెంచాలని ఈ కమిటీ సిఫార్స్ చేసింది. ఏటీఎంల ఏర్పాటును ప్రొత్సహించేందుకు ఈ పెంపు ఉపయోగపడుతుందని తెలిపింది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీలను కస్టమర్ బ్యాంక్ (కార్డును ఇష్యూ చేసిన బ్యాంక్) మనీ విత్డ్రా చేసుకున్న ఏటీఎం బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో మొదటి బ్యాంక్ను ఇష్యూయర్ అని, రెండో బ్యాంక్ను అక్వైరర్ అని అంటారు. ఈ ఇంటర్చేంజ్ ఛార్జీలను అక్వైరర్ బ్యాంక్, ఏటీఎం మెయింటెయిన్ చేస్తున్న కంపెనీలు పంచుకుంటాయి. అందువల్లనే బ్యాంకులు ఇతర ఏటీఎంలను వాడొద్దంటూ కస్టమర్లకు సూచిస్తుంటాయి. ఏటీఎంలను ఏర్పాటు చేసే కంపెనీలకు ఈ ఛార్జీలే కీలకం. ఈ రిపోర్ట్ సిఫార్సుల ప్రకారం రూరల్, సెమి అర్బన్ ఏరియాలలో ఈ ఇంటర్చేంజ్ ఫీజు ట్రాన్సాక్షన్పై రూ. 18 కి పెరుగుతుంది. కాగా, ఈ ప్రతిపదనలను కనుక ఆర్బీఐ ఆమోదిస్తే ఆ ఎఫెక్ట్ మోదీ ప్రభుత్వంపై పడటం ఖాయమని పలువురు స్పష్టం చేస్తున్నారు.