కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను తెగదెంపులు చేసుకునేందుకు భారత్ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే దిగుమతులపై తీవ్ర ఆంక్షలు పెట్టేందుకు జాబితాను సిద్ధం చేసింది. అదే సమయంలో సుంకాల పెంపును కూడా భారీగా ఉండబోతోందని సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారం ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానున్నదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఢిల్లీ హోటల్స్ మరియు రెస్టారెంట్ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఢిల్లీలోని హోటళ్లలో కానీ, గెస్ట్ హౌజ్లలో కానీ చైనా పౌరులకు వసతి సదుపాయం కల్పించకూడదని నిర్ణయించుకున్నాం. ఢిల్లీలో 3,000 బడ్జెట్ హోటళ్లు, గెస్ట్ హౌజ్లూ ఉన్నాయి. వీటిలో చైనాకు చెందిన ఏ వస్తువునూ వాడకూడదని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాం’’ అంటూ తెలిపారు.
అలాగే భారత్లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత వారం రోజులుగా చైనా వస్తువులను దేశీయంగా బహిష్కరించాలని, దిగుమతులను రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి చైనా నుంచి వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చే వారిలో ఢిల్లీ, ముంబై, కోల్కతా నగరాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇప్పుడు ఢిల్లీ హోటల్స్ మరియు రెస్టారెంట్ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులు తీసుకున్న నిర్ణయం వారికి భవిష్యత్లో ఇబ్బందిగా మారునుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చైనా సరిహద్దుల వద్ద పదేపదే ఉల్లంఘణలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. మళ్లీ మళ్లీ భారత్తో కయ్యానికే సై అంటోంది. గిల్లికజ్జాలకు దిగుతోంది. నోటివెంట శాంతి ప్రవచనలు చేస్తూనే నొసలుతో కయ్యానికే రెడీ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మంచు కొండల్లో భారత్ తనపై వ్యూహాత్మకంగా పైచేయి సాధించకుండా ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నాలను చైనా చేస్తూనే ఉంది. ఉత్తరాన అక్సాయ్చిన్ నుంచి దిగువన ప్యాంగాంగ్ నది వరకు కూడా మొత్తం తనదేనని వాదిస్తోంది. ఈ నెల 15న గాల్వన్ లోయలో చై నా దుస్సాహసం కూడా ఈ కోవలోనిదే.