ప్రపంచవ్యాప్తంగా చైనా తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నా...డ్రాగన్ కంట్రీ మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు. తన దూకుడును, వివాదాస్పద వైఖరిని ఆ దేశం కొనసాగిస్తూనే ఉంది. గల్వాన్ లోయలో గలాట సృష్టించిన చైనా ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు అక్కడ టెంట్లు వేసి రచ్చ చేస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా సైన్యం మే నెలనుంచే భారీగా బలగాలను మోహరించిందని కేంద్రం వెల్లడించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ఎల్ఏసీ వద్దకు చేర్చి రెండుదేశాల మధ్య ఉన్న అన్ని నియమాలనూ ఉల్లంఘించిందని పేర్కొంది. కాగా, భారత్ సంయమనంతోనే చైనా దూకుడు కొనసాగుతోందని పలువురు పేర్కొంటున్నారు.
భారత్ను రెచ్చగొట్టేలా, గల్వాన్ లోయలో భారత బలగాలు ధ్వంసం చేసిన చోటనే చైనా సైనికులు మళ్లీ టెంట్ల వంటి నిర్మాణాలు చేపట్టారు. ఈ ఘర్షణ జరిగిన పెట్రోల్పాయింట్ 14 వద్దనే చైనా మళ్లీ నిర్మాణాలు చేపట్టినట్టు శాటిలైట్ చిత్రాల్లో గుర్తించామని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఎల్ఏసీ వెంట చైనా పదివేలకు మించి బలగాలను మోహరించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్నిచోట్ల చైనా భారీ సంఖ్యలో ఆయుధాలు, యుద్ధట్యాంకులు కూడా మోహరించింది. ఒకవైపు చర్చలంటూనే సరిహద్దుల్లో భారీగా నిర్మాణాలు చేపట్టి సైన్యాన్ని తరలించిందని మండిపడింది. గల్వాన్ ఘర్షణకు చైనా సైన్యమే కారణమని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పునరుద్ఘాటించారు. ‘గల్వాన్ ప్రాంతంలో సాధారణంగా జరిగే భారత పెట్రోలింగ్ను మే ప్రారంభంలోనే చైనా అడ్డుకోవటం మొదలుపెట్టింది’ అని మండిపడ్డారు.
కాగా, సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే సామర్థ్యం భారత్- చైనాకు ఉన్నాయని చైనా రాయబారి సున్ వీడన్ అన్నారు. మరోవైపు భారత్- చైనా మధ్య వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు చర్చలు చేపట్టాలని ఆయన రెండు దేశాలను కోరారు. లడఖ్లో పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నదని, ఇది ఆందోళన కలిగిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. గాల్వన్ ఘటన పట్ల బ్రిటన్ ప్రధాని బోరిస్ తొలిసారి ప్రకటన చేశారు. హౌజ్ ఆఫ్ కామన్స్లో జరిగే పీఎం క్వశ్చన్స్ చర్చలో ఆయన ఈ ప్రకటన చేశారు. భారత్, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలపై ప్రధాని స్పందించాలని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఫ్లిక్ డ్రుమ్మాండ్ కోరారు. ఆ వివాదంలో బ్రిటన్ పాత్రను చెప్పాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు దేశాలు తమ సరిహద్దు సమస్యపై చర్చలు నిర్వహించాలని ప్రధాని బోరిస్ ఈ సందర్భంగా తెలిపారు.