కరోనా వైరస్.. గత ఏడాది డిసెంబరులో చైనా నుంచి పుట్టుకొచ్చిన ఈ మహహ్మారి ఇప్పటికీ దాని విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కంటికి కనిపించని కరోనా.. ప్రపంచదేశాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. దీంతో కరోనా పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 97 లక్షలు దాటిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. మరోవైపు ఈ కరోనా మనుగడకు అడ్డుకట్ట వేయడానికి ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు విశ్వపయత్నాలు చేస్తున్నాయి.
అయినప్పటికీ ఫలితం దక్కకపోగా.. మానవ మనుగడకే సవాల్ విసురుతోంది కరోనా. ఇక ఈ కరోనా కాలంలో.. దోమకాటు వల్ల ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తిస్తుందా..? లేదా అనే సందేహాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దీనిపై ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఐఎస్ఎస్ శాస్త్రీయ అధ్యయనం చేయగా.. దోమలు మానవులలో కరోనా వైరస్ను వ్యాప్తి చేయలేవని తేలింది. ఇప్పటికే రక్తం పీల్చే కీటకాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది.
దోమలు మానవులను కరిచినప్పుడు డెంగ్యూ, కోవ్-2ను వ్యాప్తి చేయలేవని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. అయినప్పటికీ కొందరిలో ఇవే సందేహాలు వ్యక్తం అవుతుండడంతో.. ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రీయ అధ్యయనం ఓ క్లారిటీ ఇచ్చింది. దీని ప్రకారం.. దోమ కాటుతో కరోనా వ్యాప్తిచెందదని తేల్చి చెప్పాలి. అలాగే కరోనా నుంచి కోలుకున్న 30 శాతం మంది రోగులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. కరోనా నెగెటివ్ అయినప్పటికీ, అటువంటి రోగులు ఆరోగ్యంగా ఉండరని, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా ఎప్పుడూ అలసిపోతారని నిపుణులు స్పష్టం చేశారు. కాబట్టి.. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.