ఈ మద్య మనుషులు మృగాలకన్నా దారుణంగా తయారవుతున్నారు. మూగ జీవాలను హింసించి చంపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఆ మద్య కేరళాలో గర్భంతో ఉన్న ఏనుగు బాంబు తో కూడిన తిను పదార్థం తినడంతో నోరి పేలిపోయి దాదాపు పద్నాలుగు రోజులు పాటు చిత్ర హింసలకు గురైంది.. చివరికి ప్రాణాలు విడిచింది. ఇలా ఏనుగులను కేవలం దంతాల కోసం కృరంగా చంపుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. అంతే కాదు ఓ కుక్క మూతికి ప్లాస్టర్ చుట్టడంతో అది ఆకలితో అలమటించింది. మొత్తానికి దాన్ని డాగ్ కేర్ వాళ్లు తీసుకువెళ్లి వైద్యచికిత్స అందించారు. మరికొంత మంది టిక్ టాక్ కోసం మూగ జీవాలను హింసిస్తూ పిచ్చి ఆనందాన్ని పొందారు.
దేశంలో ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతున్నా.. కొంత మంది వ్యక్తులు మాత్రం తమ ఉన్మాదాన్ని ఇలా మూగజీవాలపై చూపుతున్నారు. తాజాగా నీటి తొట్టిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కోతిని మానవతా దృక్పథంతో కాపాడాల్సింది పోయి ఆ కోతిని ఉరి తీసి చంపాడో కర్కశుడు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మపాలెంలో సాదు వేంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ఆవరణలో నీటి తొట్టి ఉంది. పాపం ఓ కొతి దాహార్తి తీర్చుకోవడానికి ఆ నీటి తొట్టి వద్దకు వచ్చి ప్రమాదా వశాత్తు అందులో పడిపోయింది. ఆ కోతి నీటి తొట్టిలో పడిపోవడంతో పక్కనే ఉన్న కోతులు అరవడం మొదలు పెట్టాయి.
ఆ సమయానికి అక్కడకు వచ్చిన వేంకటేశ్వరరావు అనే వ్యక్తి దాన్ని కాపడాల్సింది పోయి మిగతా కోతులు చూస్తుండగా దాన్ని ఉరివేసి తనలోని పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆ కోతి చనిపోవటంతో కుక్కలకు ఆహారంగా పడేశాడు. మిగతా కోతులు కుక్కలను, మనుషులను దగ్గరికి రానీయకుండా మృతిచెందిన కోతిని తీసుకెళ్లి తమలోని ఐక్యమత్యాన్ని చాటుకున్నాయి. ఇలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.