కరోనా వైరస్ చికిత్సలో రెమ్డిసివిర్ డ్రగ్ సరైన ఫలితాన్ని ఇస్తోంది. గిలీడ్ సైన్సెస్ సంస్థ ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నారు. ఈ ఔషధం వాడిన వారు చాలా వేగంగా కోవిడ్ నుంచి కోలుకుంటున్నట్లు తేలింది. అయితే, కరోనా వైరస్ చికిత్సలో కీలకంగా పనిచేస్తున్న ఈ ఔషధాన్ని అమెరికా సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఈ ఔషధాలను మొత్తం ఆ దేశమే కొనేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ శాఖ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్డిసివిర్ను ఉత్పత్తి చేసే గిలీడ్ సంస్థతో ట్రంప్ సర్కార్ అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. జూలైలో జరిగే వంద శాతం ఉత్పత్తిని అంటే సుమారు 5 లక్షల డోస్లను తమకే ఇవ్వాలని గిలీడ్తో అమెరికా డీల్ చేసుకుంది. ఆగస్టులో 90 శాతం, సెప్టెంబర్లో 90 ఔషధ సరఫరాను కూడా తమకే ఇవ్వాలని ట్రంప్ సర్కార్ గిలీడ్తో ఒప్పందం కుదుర్చుకుంది.
మరోవైపు, దక్షిణ కొరియాలో రెమిడిసివిర్ ఔషధ వినియోగం ప్రారంభమైంది. గిలీడ్ సైన్సెస్ ఆ ఔషధాన్ని దక్షిణ కొరియా విరాళంగా అందించింది. అయితే ఆగస్టులో ఆ మాత్రలను ఖరీదు చేసేందుకు కొరియా సీడీసీ శాఖతో ఒప్పందం జరగనుంది. న్యూమోనియా వ్యాధితో బాధ పడేవారు, ఆక్సిజన్ థెరపి తీసుకుంటున్నవారికి రెమ్డిసివిర్ ఔషధం పనిచేస్తుందని గిలీడ్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాధి చికిత్సలోనూ ఈ ఔషధాన్ని వాడారు. ఇది యాంటీ వైరల్ మెడిసిన్. ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్ ట్రయల్స్ జరిగింది. వ్యాధి లక్షణాలను 15 రోజుల నుంచి 11 రోజులకు తగ్గించడంలో ఔషధం ఉపయోగపడినట్లు తెలుస్తోంది. కాగా, అమెరికా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి కొరత వస్తుందా అనే సందేహం వ్యక్తం అవుతోంది.