ఇప్పుడంతా కరోనా కలకలమే. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మన దేశంలో ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడాలేకుండా ఎక్కడైనా ఇదే దోరణి. కరోనా వైరస్ సోకితే ప్రాణాలు పోతాయనే భయం చాలామందిలో ఉంది. అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తూ, వైద్యుల సూచనలు అనుసరిస్తే వైరస్ను జయించవచ్చని తెలంగాణ రాష్ట్రంలో రుజువైంది. సదరు లెక్కలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. షుగర్, బీపీ, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాలున్నవారు సైతం రాష్ట్రంలో కరోనా బారినుంచి బయటపడుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి వ్యాధులున్నవారు 2,500 మందికిపైగా వైరస్ బారినపడగా, 90 శాతం మంది కోలుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు 2,500 మందిపైగా ఉన్నారు. వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. వీరిలో ఎక్కువగా కనిపించే సమస్య షుగర్, బీపీ. అయినప్పటికీ చికిత్స ద్వారా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు. 94 శాతం మందికి షుగర్, 89 శాతం మందికి బీపీ ఉన్న బాధితులు కూడా వైరస్పై విజయం సాధిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉండి కరోనా సోకిన వారిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారిస్తూ చికిత్స అందిస్తున్నారు. నిత్యం వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ, అవసరమైన మందులు, పౌష్టికాహారం అందించడంతోపాటు వారికి భరోసా ఇస్తున్నారు. బీపీ, షుగర్ వంటి సాధారణ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న కరోనా బాధితులు ధైర్యంగా పోరాటం చేస్తున్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఉండి కూడా ఎలాంటి లక్షణాలు లేనివారు వైద్యుల సూచనలు అనుసరిస్తూ హోంక్వారెంటైన్లో ఉండి వైరస్ను జయిస్తున్నారు
ఇదిలాఉండగా, ఒకటి లేదా రెండు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ప్రమాద రేటు తక్కువగానే ఉండగా, వీటికి మరికొన్ని వ్యాధులు తోడైతే ప్రమాద రేటు పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో 486 మంది షుగర్ పేషెంట్లు కరోనా చికిత్స పొందగా, 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 473 మంది బీపీ ఉన్నవారిలో 27 మంది మృతి చెందారు. బీపీ, షుగర్కు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నవారిలో మరణాలు రేటు ఎక్కువగా ఉన్నది. ఇలాంటివారు మొత్తం 1,000 మందివరకు ఉండగా, ఇందులో 100 మంది చనిపోయారు. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు జాగ్రత్తగా నడుచుకోవాలని, పొగతాగడం, మద్యపానం అలవాట్లను మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రోగ నిరోధక శక్తి పెంచుకొనే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.