పొరుగు దేశమైన డ్రాగన్ కంట్రీకి అంతర్జాతీయంగా షాకులు తగులుతున్నాయి. మన సరిహద్దుతో పాటుగా ఇతర దేశాలతో ఉన్న సరిహద్దుల్లోనూ వివాదాలు సృష్టిస్తున్న చైనాకు షాక్ తగిలే పరిణామం జరిగింది. హాంకాంగ్ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉన్న వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి చైనా మంగళవారం ఆమోదం తెలిపింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా ఘాటుగా స్పందించింది. నియంతృత్వ చర్యలు, చట్టాలతో హాంకాంగ్ను మింగెయ్యాలనుకుంటే, చూస్తూ ఊరుకోబోమని అమెరికా చైనాను హెచ్చరించింది. భారత్ నిర్ణయాల పట్ల మద్దతుగా మాట్లాడే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ మేరకు స్పష్టం చేశారు.
హాంకాంగ్ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉన్న వివాదాస్పద జాతీయ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలుపడం హాంకాంగ్ ప్రజలకు ఇదో విచారకరమైన రోజుగా మైక్ పాంపియో అభివర్ణించారు. ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’గా ఉన్న విధానాన్ని.. ‘ఒక దేశం, ఒక వ్యవస్థగా’ మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాయడమే చైనా గొప్ప విజయంగా భావిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఇదిలాఉండగా, ఇప్పటికే పలు విషయాల్లో చైనాకు ఇచ్చేలా పాంపియో మాట్లాడారు. గాల్వన్ వ్యాలీ ఘటన నేపథ్యంలో భారత్ చైనాకు సంబంధించిన 59 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ కోసమే చైనా యాప్లను బ్యాన్ చేస్తున్నట్లు భారత సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టిక్టాక్, వీచాట్తో సహా 59 చైనా యాప్లను భారతదేశం నిషేధించడాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో ప్రశంసించారు. ఈ చర్య భారతదేశ సమగ్రతను, జాతీయ భద్రతను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ చైనా యాప్లను నిషేధించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. భారత్ తీసుకున్న ఈ క్లీన్యాప్ విధానం ఆ దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, జాతీయ భద్రతను పెంచుతుంది’ అని పాంపీయో వ్యాఖ్యానించారు.