ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. చైనాలోని పుహాన్ లో పురుడు పోసుకున్న ఈ కరోనా రక్కసి ప్రపంచానికి ప్రళయంగా మారిపోయింది. ఏ వైరస్ చూపించని భయంకరమైన ప్రభావం కరోనా వైరస్ చూపిస్తుంది. మొన్న ఆదివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2,12,000 కొత్త కేసులు నమోదవగా, 3586 మంది మరణించారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా అమెరికా లాంటి అగ్రరాజ్యంపైనే చూపిస్తుంది. 60 శాతం అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అమెరికాలో నిన్న 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, బ్రెజిల్లో 24,431 కరోనా కేసులు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,56,641 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈ వైరస్ వల్ల 5,36,776 మంది చనిపోయారు. ఇక భారత్ విషయానికి వస్తే.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మూడో స్థానంలోకి చేరుకుంది. మొన్నటి వరకు రష్యా ఉండగా ఒక్క ఆదివారం తారుమారైంది. గత 24 గంటల్లో భారత్లో 22,252 మందికి కొత్తగా కరోనా సోకిందని తెలిపింది. అదే సమయంలో 467 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 7,19,665 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 20,160కి పెరిగింది. 2,59,557 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 4,39,948 మంది కోలుకున్నారు. ఇంతగా కరోనా వైరస్ భయపెడుతున్న సందర్భంలో ఆ 16 జిల్లాలో మాత్రం నో కరోనా అంటున్నారు. దేశంలోని లక్షద్వీప్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్ము కశ్మీర్లలోని 16 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అలాగే 250కి పైగా జిల్లాల్లో 100 కన్నా తక్కువ, 143 జిల్లాల్లో 100 నుంచి 200 కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలోని 81 జిల్లాల్లో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదై, అక్కడి ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి.