చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా కబళిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1.12 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఐదు లక్షల మందికి పైగా చనిపోయారు. మన దేశం విషయానికి వస్తే మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏడున్నర లక్షలను సమీపిస్తోంది. ప్రతి రోజు 20వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ఉన్నవారిని హోం క్వారంటైన్ లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. అయితే హూం క్వారంటైన్ లో 14 లేదా 28 రోజులు ఉంచుతున్నారు.. దాంతో కొంత మంది అక్కడ ఉండలేక పారిపోవడం.. పిచ్చి పట్టినవారిలా ప్రవర్తించడం మరికొంత మంది ఏకంగా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే హోమ్ క్వారంటైన్లో ఉన్న 15 ఏళ్ల బాలుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాలిగ్రామకు చెందిన 15 ఏళ్ల బాలుడు కోటలో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆ కుర్రాడు సాలిగ్రామలో ఉంటున్న తల్లి దగ్గరకు వచ్చేశాడు. అతడి తల్లి ఓ ఇంట్లో పని మనిషిగా వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే ఆమె పని చేస్తున్న ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ తల్లీబిడ్డలను హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.
అయితే బాలుడు మాత్రం కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలుడు తన గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడిని ఆ స్థితిలో చూసిన ఆ మాతృమూర్తి తల్లడిల్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆ బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బాలుడు బాగా డిప్రెషన్ కి లోనై ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు బావిస్తున్నారు. మృతదేహానికి కరోనా టెస్టు చేసిన తర్వాత అంత్యక్రియలకు పంపనున్నట్లు తెలిపారు.