ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో 8మంది పోలీసుల మృతికి కారణమైన కేసులో ప్రధాన నిందితుడు, మోస్టు వాటెండ్ క్రిమినల్ వికాస్ దూబే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 3న కాన్పూర్ పోలీసులు హత్య కేసులో వికాస్ దూబేను అరెస్టు చేసేందుకు బిక్రూ గ్రామానికి వెళ్తుండగా వారి వాహనానికి దూబే అనుచరులు భూమిని చదును చేసే యంత్రాన్ని అడ్డుపెట్టి వాహనాల చాటు నుంచి పోలీసులపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ డిప్యూటీ ఎస్పీస్థాయి అధికారితోపాటు, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. దాంతో ఈ కేసు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సీరియస్ గా తీసుకున్నారు.
నాటి నుంచి దూబే పరారీలో ఉండగా పోలీసులు 40బృందాలుగా ఏర్పడి అతడి ఆచూకీ కనుగొనే పనిలో పడ్డారు. శుక్రవారం హర్యానాలో పోలీసుల కంటపడిన దూబే చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. అయితే ఇతని అనుచరులను పట్టుకోవడం.. ఐదుగురిని ఎన్ కౌంటర్ చేయడం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో గురువారం ఉదయం పోలీసులకు పట్టుబడ్డాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాశ్ దుబే. తాజాగా వికాశ్ దూబేను అరెస్టు చేసిన ఆ రాష్ట్ర పోలీసులకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నేరస్తులను ఏ మాత్రం ఉపేక్షించబోదని ఆయన అన్నారు. ‘ఎవరైతే పాపాలను కడుక్కునేందుకు మహాంకాళి వద్దకు వెళ్తారో వారికి దేవుడి మహత్యం అర్థం కాదు’ అని దూబే అరెస్టును ఉద్దేశించి ఆయన తన సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు. అంతే కాదు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడనని మధ్యప్రదేశ్ పోలీసులు గ్యాంగ్స్టర్ దూబేను త్వరలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగిస్తారని పేర్కొన్నారు. కాగా, మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా దూబే అరెస్టును ద్రువీకరించారు.