ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్లాక్ కొనసాగుతుండటం... ప్రజలందరూ యథేచ్ఛగా రోడ్లమీద తిరుగుతుండటం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వెరసి కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అయితే భారతదేశంలో జనవరి 21వ తేదీన మొదటి కరోనా కేసు నమోదు అయింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను ఎంతగానో కట్టడి చేస్తూ వచ్చింది. కేవలం ఒక కేసు నుంచి లక్ష కేసుల వరకూ చేరుకోవడానికి ఏకంగా 110 రోజుల సమయం పట్టింది. ఇక ఆ తర్వాత లక్ష నుంచి ఏడు లక్షల కేసులకు చేరుకోవడానికి 49 రోజుల సమయం పట్టింది.
కానీ ఏడు లక్షల నుంచి 8 లక్షల కేసుల మార్క్ ను దాటడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే పట్టింది. గత ఇరవై నాలుగు గంటల్లో 27 వేలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్లో కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల మార్కును దాటేసింది. ఇలా భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న గణాంకాలు చూస్తుంటే ప్రతి ఒక్కరీ వెన్నులో వణుకు పుడుతుంది. ఇక దేశంలో మూడు రాష్ట్రాల లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలలో నాలుగున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
ఈ మూడు రాష్ట్రాల్లో 70 శాతం కేసులు ఉంటే మిగతా అన్ని రాష్ట్రాలలో కేవలం 30 శాతం కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ మరణాలలో కూడా ఈ మూడు రాష్ట్రాలే మొదటి స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు వరకు దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 21,604 ఉండగా ఇందులో 80 శాతం మరణాలు ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. ఇలా రోజురోజుకు పెరిగి పోతున్న కేసులతో భారత ప్రజానీకం మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఉక్కిరిబిక్కిరి అవుతూ... ప్రశ్నార్థకమైన జీవితాన్ని గడుపుతున్నారు.
Powered by Froala Editor