మాఫియా సామ్రాజ్యంలోకి అడుగు పెడితే జీవితం క్షణ క్షణం ప్రాణ గండం లాంటిదే. గన్ పట్టిన వాడు అదే గన్ తో కన్నుమూస్తాడు అంటారు.. నిజమే ఇప్పటి వరకు నేర ప్రపంచంలోకి అడుగు పెట్టిన వారు ఏదో ఒక విధంగా హత్యకు గురి అవుతూనే ఉన్నారు. ఈ మద్య దేశాన్ని మొత్తం కాన్పూర్ సంఘటన కుదిపేసింది. జూన్ 3న కాన్పూర్ పోలీసులు హత్య కేసులో వికాస్ దూబేను అరెస్టు చేసేందుకు బిక్రూ గ్రామానికి వెళ్తుండగా వారి వాహనానికి దూబే అనుచరులు భూమిని చదును చేసే యంత్రాన్ని అడ్డుపెట్టి వాహనాల చాటు నుంచి పోలీసులపైకి కాల్పులు జరిపారు.
కాల్పుల్లో ఓ డిప్యూటీ ఎస్పీస్థాయి అధికారితోపాటు, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. నాటి నుంచి వికాస్ దూబే పరారీలో ఉండగా పోలీసులు 40బృందాలుగా ఏర్పడి అతడి ఆచూకీ కనుగొనే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కరడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే నిన్న ఉదయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి భారీ భద్రతతో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు కాన్పూర్కు తరలిస్తున్నారు. కాన్వాయ్లోని ఓ కారు కాన్పూర్ సమీపంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
ఇదే అదనుగా భావించిన దూబే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. తాజాగా ఈ ఎన్కౌంటర్పై అతని భార్య రిచా దుబే స్పందించారు. వికాస్ ఇలాంటి చావుకు అర్హుడే అని ఆమె తెలిపారు. వికాస్ చాలా పెద్ద తప్పు చేశాడని, అతనికి చావు ఇలా రాసి పెట్టి ఉందని రిచా చెప్పారు. కాన్పూర్లోని భైరోఘాట్లో జరిగిన వికాస్ దుబే అంత్యక్రియల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె వెంట కుమారుడు, తన తమ్ముడు దినేష్ తివారీ ఉన్నారు.