ప్రవాస భారతీయుల ఓట్ల కోసం ట్రంప్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో భారత్ వచ్చారు. మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికి నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని గుజరాత్ లో పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతకు ముందు మోడీ అమెరికా వెళ్ళినపుడు హౌడీ మోడీ ద్వారా కూడా భారతీయులను ట్రంప్ కి మరింత చేరువ చేశారు.
ఇదిలా ఉండగా ట్రంప్ ఇపుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. పూర్తివా వ్యాపారవేత్త అయిన ట్రంప్ మళ్ళీ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవాలి. దాని కోసం ఏమైనా చేస్తాడు. అందులో భాగమే షరతులు పెట్టి భారతీయుల వీసాల విషయంలో ఇరుకునపెట్టడం. నిజంగా ట్రంప్ విధానం వల్ల నష్టపోయింది ఎక్కువగా ఇండియన్సే.
ఇదిలా ఉండగా ట్రంప్ ఇపుడు మరో విధంగా కూడా చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాణిజ్య దేశంగా, పెట్టుబడులకు స్వర్గధామంగా ఇండియా ఎదగకూడదు అన్న ధ్యేయంతోనే పనిచేస్తున్నాడు. అందులో భాగంగా చైనా నుంచి వస్తున్న కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా వారి మీద ఆంక్షలు పెడుతున్నాడు.
ఇది చాలదన్నట్లుగా ఓ వైపు చైనాతో భారత్ యుధ్ధం అనివార్యం అన్న సీన్ వచ్చేదాకా రెచ్చగొడుతూనే మరో వైపు చైనాతో వాణిజ్య ఒప్పందాలకు రెడీ అవుతున్నాడు. అంటే బయటకు చైనాని తిడుతూనే ఆ దేశంతో దోస్తీకి అర్రులు చాస్తున్నాడు అన్న మాట. ఇలా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిస్తున్న ట్రంప్ భారత్ విషయంలో ఏ రకంగా మేలు చేస్తాడు అన్నది అర్ధం చేసుకోవాల్సిన విషయమే.
వాడేసుకోవడం అంటూ మొదలుపెడితే తన సాటి రారు అన్నట్లుగా ట్రంప్ వైఖరి ఉంది. మరి భారత్ అమెరికా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ వ్యవహరాల నిపుణులు సూచిస్తున్నారు. మనకు మరీ అంత అమెరికా మోజు మంచిది కాదు అని సూచిస్తున్నారు.