కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి.. శరవేగంగా ప్రపంచదేశాలు కమ్మేసి ప్రజలందరికీ పెను గండంగా మారింది. అడ్డు అదుపు లేకుండా విస్తరిస్తున్న కరోనా దెబ్బకు ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెందరికో కరోనా సోకి.. నానా ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రపంచదేశాలు శాస్త్రవేత్తలు రాత్రి, పగలు అని తేడా లేకుండా.. కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయితే ఎన్ని పరిశోధనలు చేస్తున్నా.. ఇప్పటివరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడడంలేదు. ఈ క్రమంలోనే కరోనా బాధితుల సంఖ్య కోటి 30 లక్షలు దాటింది. మృతుల సంఖ్య సైతం అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు ఈ వైరస్ ఎటు నుంచి వచ్చి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో కరోనా గురించి షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. వాస్తవానికి కరోనాపై పోరాటంలో శరీరంలోని యాంటీబాడీలు కీలకంగా పని చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇవి కొన్ని నెలల్లోనే తగ్గిపోతున్నట్లు లండన్లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా సోకిన 65 మందిపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. దీంతో కరోనా సోకిన వారికి నయం అయినా.. సాధారణ జలుబు మాదిరిగానే కరోనా కూడా మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు డాక్టర్ కేటీ డూరెస్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేటీ మరో విషయం తెలిపారు. యాంటీబాడీలు మూడు నెలల్లోనే తగ్గిపోతున్నాయంటే వ్యాక్సిన్లు కూడా అంతే అనుకోవచ్చని.. ఒకసారి వ్యాక్సిన్ వేస్తే సరిపోదు. మళ్లీ వేయాల్సిన అవసరం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.