విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి,ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, శ్రీహరి, శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు. 

 

విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం లాంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సిఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్  డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి సీఎంకు చెప్పారు. ఇద్దరు తమ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నారని చెప్పారు. వారిద్దరినీ ప్రోత్సహించాలని, ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని సిఎం నిర్ణయించారు.

 


జడ్చర్ల డిగ్రీ కాలేజీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, అక్కడ తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన  సదాశివయ్యతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. హృదయ పూర్వకంగా అభినందించారు.‘‘సదాశివయ్య గారు మీ గురించి అధికారులు బాగా చెప్పారు. మీ కృషిని నేను టివిల్లో స్వయంగా చూశాను. మీ అంకితభావం గొప్పది. మీకు హృదయ పూర్వక అభినందనలు. మీరు సంకల్పించినట్లుగానే జడ్చర్లలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు ప్రయత్నాన్ని కొనసాగించండి. దానికి కావాల్సిన నిధులను వెంటనే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మీలాంటి వాళ్లే సమాజానికి కావాలి. ఈ స్పూర్తిని కొనసాగించండి. పాలమూరు యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు పెంచండి. మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న మీ సామాజిక కార్యక్రమాలను కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సిఎం కేసీఆర్ సదాశివయ్యతో అన్నారు. బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమయ్యే నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: