కొందరు గుర్తించవచ్చు. కొందరు గుర్తించ నిరాకరించనూ వచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన అషామాషీ కార్యక్రమం కాదు. ఏదో పుస్తకాల్లో.. ఎవరో రాసిన లేదా తయారు చేసిన నమూనాను తీసుకువచ్చి పదేపదే ప్రతి కార్యక్రమానికి ఆ పుస్తకాన్ని తిరగేసి మార్గదర్శనం పొందడం ద్వారా సాధించింది అంతకన్నా కాదు. తెలంగాణను.. ఇక్కడి మనుషులను..సమాజస్థాయిని.. ఇక్కడి ప్రభుత్వాన్ని.. దేశకాల పరిస్థితులను.. ప్రపంచవ్యాప్త ధోరణులను అన్నింటినీ అవపోసన పట్టి మేధోమథనం చేసి రూపకల్పన చేసిన గొప్ప ప్రణాళిక.

ఈ ప్రణాళికను అంచెలంచెలుగా అమలుచేసి అనుకున్నది సాధించిన వీరుడు కేసీఆర్. ప్రాంతాలు వెనుకబడి ఉండడం ద్వారా ప్రజల ఆలోచనలు కురచగా మారుతాయా? లేక మనుషుల ఆలోచనల కురచదనం వల్ల ప్రాంతాలు వెనుకబడతాయా? అనేది ఇదమిద్ధంగా చెప్పలేం కానీ.. ఇలాంటి సమాజాల్లో ఒక్క అడుగు ముందుకు వేయడం కూడా చాలా కష్టం. వేయి మంది వెనక్కి లాగే వారుంటారు. ప్రజలు సులభంగా విశ్వసించరు. నిందలు వేసేవారు వేనవేలు. అగ్నిపరీక్షలకు నిలబడాలి. త్యాగాలకు సిద్ధపడాలి. ఎదురైన ప్రతి ప్రశ్నకూ జవాబు చెప్పాలి. ఆ పరీక్షలన్నింటినీ కేసీఆర్ ఎదుర్కొన్నారు. అనుకున్న మార్గంలో ఉద్యమరథాన్ని నడపి గమ్యాన్ని ముద్దాడారు.

కొత్తమార్గం..: రాష్ట్రసాధనకు కేసీఆర్ ఎంచుకున్నది కొత్తపంథానే. పాపమో.. శాపమో కానీ మన దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా నెత్తురోడకుండా ఏర్పాటు కాలేదు. ఓం ప్రథమం ఆంధ్ర రాష్ట్రమే పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం.. అదుపు తప్పిన హింసలోంచి పుట్టుకు వచ్చింది. ఆ వేళావిశేషం అన్ని రాష్ర్టాలు హింసాత్మక వాతావరణాలనుంచే పుట్టాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆవిర్భవించిన చివరి మూడు రాష్ర్టాలు జార్ఖండ్, ఉత్తరాంచల్, వనాంచల్(ఛత్తీస్‌గఢ్)లకు కూడా హింసాత్మక ఉద్యమాల చరిత్ర ఉంది. ఇక తెలంగాణ ప్రజాఉద్యమాలకు రక్తసిక్త చరిత్ర ఉంది. ఇడ్లీసాంబార్ గోబ్యాక్‌నుంచి జై తెలంగాణ దాకా అన్నీ హింసను ఆశ్రయించుకున్నవే. ఫలితంగా అనేక మంది బిడ్డలను పోగొట్టుకున్న అనుభవం. ఆ మార్గాలు విజయం సాధించలేకపోవడం కండ్లముందున్న ఉదాహరణ. మహాశక్తి మంతమైన మదగజంకూడా అంకుశం పోటుకు లొంగిపోతుంది. ప్రభుత్వాలను వంచే అంకుశం పార్లమెంటు. కేసీఆర్..మార్గదర్శకుడు!! కలలు కన్నవాడు.. నాకో కల ఉంది... ఏదో ఒక రోజు ఈ దేశంలో నా నలుగురు పిల్లలూ వాళ్ల రంగును బట్టి కాకుండా వారి సామర్థ్యంతో గుర్తించబడతారని...నాకో కల ఉంది. ఒక రోజు అలబామాలో నల్లజాతి పిల్లలు, తెల్లజాతి పిల్లలు అన్నాతముళ్లు అక్కా చెల్లెళ్లలాగా చేతులు కలుపుతారని... 1963 ఆగస్టు 28న వాషింగ్టన్‌లో రెండు లక్షల మంది నల్లజాతి పౌరహక్కుల ఉద్యమకారులనుద్దేశించి మార్టిన్ లూథర్‌కింగ్ చేసిన చారిత్రక ఐ హావ్ ఏ డ్రీమ్‌ప్రసంగ మిది.

అచిరకాలంలోనే ఆయన కోరిక నేరవేరింది. జాతి విచక్షణ అంతం చేసే బిల్లును అమెరికా పార్లమెంటు ఆమోదించింది. కేసీఆర్ కూడా అలాంటి స్వాప్నికుడే. తెలంగాణ తప్పక సాకారమవుతుంది. ఎందుకంటే మాది ధర్మపోరాటం. మాది మాకు కావాలని అడుగుతున్నం. ఇంకొకల్లది కావాలని అంటలేం.... ఒక రోజు వస్తది. తెలంగాణ మొత్తానికి మొత్తం గిరిగీసి ఒక్క దిక్కు నిలబడతది. మా తెలంగాణ మాకు ఇవ్వాలని గర్జిస్తది. ప్రజలంతా ఒక్కతాటి మీదికి వచ్చినంక ఆ ప్రజాస్వామిక ఆకాంక్షను పార్లమెంటు కానీ కేంద్రం కానీ గుర్తించక తప్పదు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షను ఎంత గొప్ప ప్రభుత్వం కూడా బుల్డోజ్ చేయడం సాధ్యం కాదు.... తెలంగాణ ఒక రాష్ట్రంగా నిలబడదనేది దుష్ప్రచారం. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటది. మీరు చూస్తూ ఉండండి... మేం రాష్ర్టాన్ని కడుక్కు తాగటానికి అడగడం లేదు. ఇక్కడ అద్భుతమైన వనరులు ఉన్నై. రేపటి రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలి. నదుల నీళ్లు మళ్లించి బీడు భూములు సస్య శ్యామలం చేయాలి. ప్రపంచంలోనే అద్భుతమైన వాతావరణం తెలంగాణది. దాన్ని సాధించేది రాజకీయ ప్రజాస్వామ్య పంథా. తెలంగాణ సాధనకు కేసీఆర్ ఆ పంథాను ఎంచుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి అధికసీట్లు సాధించడం ద్వారా ప్రభుత్వాలను లొంగదీసి రాష్ర్టాన్ని సాధించడం.. 14 ఏండ్లపాటు సడలించకుండా జరిపిన నిరంతర ఉద్యమాలతో మదగజం తలొగ్గింది. తెలంగాణ సాకారమైంది. ఈ మధ్య కాలంలో ఎన్ని నిందలు? ఎన్ని ఆరోపణలు? ఎంతటి వెటకారాలు? ఎన్ని వెన్నుపోట్లు?... ఓట్లు సీట్లతో రాదన్నారు. పదవుల కోసమే తెలంగాణ అని నిందలు వేశారు. ప్రజాఉద్యమాలు మాత్రమే తెలంగాణ తెస్తాయని ప్రవచించారు. కానీ... సడలని నమ్మకం విజయం సాధించింది. రాజకీయ పంథాయే గెలుపు మార్గమైంది. మార్గాన్ని తెలిసిన వాడు మార్గదర్శకుడు. ఇక్కడ పరిశ్రమలు వెల్లువెత్తాలి. ఇప్పటికే వరల్డ్ సీఈవోల సమావేశం హైదరాబాద్‌ను పరిశ్రమల స్థాపనకు ఉత్తమమైందని ప్రకటించింది. పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతం. ఇక్కడి నేలలు విత్తనాభివృద్ధికి ఎంతో అనుకూలం తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేస్తం. ఇక కేజీ టు పీజీ నాకున్న పెద్ద కల. ఒక జనరేషన్‌ను మనం తీర్చి దిద్దితే అనేక తరాలు బాగుపడతయ్..ఇది ఓ సీమాంధ్ర టీవీ చానెల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ ఆవిష్కరించిన ఆయన స్వప్నం. ఇవాళ ఆ స్వప్నాన్ని పాలనలో తర్జుమా చేయడం చూస్తున్నాం. శ్రీకృష్ణ కమిటీ నిరాశ పరిచిన వేళ...ఉద్యమ నేత ఉద్రేకాలు రేపటమే కాదు.. కష్టాల్లో అండగా ఉండి కన్నీళ్లు తుడవాలి. భరోసానివ్వాలి. తెలంగాణ ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక యువకులు, విద్యార్థుల మనోధైర్యాన్ని దెబ్బ తీసిన వేళ..బలిదానాలు పెరుగుతున్న వేళ కేసీఆర్ చేసిన ప్రసంగం వారికి కౌన్సెలింగ్. ఇందిరాపార్కు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేసీఆర్ చెప్పిన మాటలు వారిలో మనోధైర్యాన్ని కలిపించింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు..ఎట్లున్నదంటె ఇటున్నోడు ఇటు చెప్పుకోవచ్చు.. అటున్నోడు అటు చెప్పుకోవచ్చు. ఎవ్వనికి వాటమున్నట్టు వాడు చెప్పుకోవచ్చు. మేం సాఫ్‌సీదా మాట చెప్తున్నం. తెలంగాణకు వాటమున్నది ఏందంటె.. రివర్టింగ్ బ్యాక్ టు నైంటీన్ ఫిఫ్టీసిక్స్ అని అన్నరు.. మాకుగావల్సింది అదే మేము అడుగుతున్నదిగూడగదె.. అని చెప్పి సాంత్వన కలిగించారు. కమిటీ నివేదికతో కథ ముగిసి పోలేదని చెప్పేందుకు అదే వేదిక మీద ఉద్యమ మార్గం ప్రకటించారు. జేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో తిరిగి ఉద్యమం ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. నిరాశపడ్డ యువతకు గుండెల్లో బాధ గాలిపింజల్లా తేలిపోగా ఈ మాటలు ఎంతో ధైర్యాన్ని కలిగించాయి. అదే సమయంలో బలిదానాలు తన మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయని కేసీఆర్ యువతకు సందేశం పంపిచారు. నేను తెలంగాణ యువకులకు, తెలంగాణ విద్యార్థులకు దండం పెట్టి చెప్తున్న.. మీ కడుపుల తల పెట్టి చెప్తున్న.. మీరు మిమ్ములను మీరు కాల్చుకోని చచ్చిపోతె.. మేంగూడ ఇక్కడ సగం కాలిచచ్చిపోతం. కూలిపోతం. మానసికంగ దెబ్బతింటం. కాబట్టి దయచేసి ఎవ్వరుగూడ భయపడొద్దు. కచ్చితంగా తెలంగాణ వచ్చే కోసం వచ్చేవరకు మనం పోరాటం చేద్దాం. ఎనుకకు పోయె సమస్యే లేదు. మడమ తిప్పే ముచ్చటే లేదు. ఎవ్వరుగూడ దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇగ తప్పదనుకుంటె గిట్ట నేనే దీక్షకుపోత.. ఉంటె ఉంటా పోతెపోత. ఇగ ఎందాకైతె అందాక! అంటూ చెప్పిన ఆయన మాటలు యువత మనోధైర్యాన్ని రీచార్జి చేశాయి. కేసీఆర్.. సాంత్వననిచ్చిన సమాజ వైద్యుడు !! జాతికి ఔన్నత్యం గుర్తుచేసిన వాడు.. ఏ జాతి అయినా తన పూర్వీకులనుంచి.. వారసత్వంనుంచి స్ఫూర్థి పొందుతుంది. ఘనమైన వారసత్వం.. తిరిగి దాన్ని సాధించాలనే కాంక్షకు కారణమవుతుంది. కేసీఆర్‌కు ముందు తెలంగాణ ఔన్నత్యం గురించిన ప్రచారం లేదు. సీమాంధ్రపాలకుల పుస్తకాల్లో తెలంగాణలో అంధకారయుగం అన్నారు. ఆ అంధకారంలో ఉన్న తెలంగాణకు అత్యున్నత చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వారసత్వం ఉందని ఊరూరా చాటింది కేసీఆర్. అలాగే మోహావేశ బంధనమైన తెలుగు తల్లి భావనకు బద్దలు కొట్టిందీ కేసీఆరే. తెలంగాణ తల్లికి రూపమిచ్చి ఊరూరా విగ్రహాలు సృష్టించింది ఆయనే. ఇక నిజాం వారసత్వం మీద తెలంగాణ చరిత్ర మీద జరిగిన దుష్ప్రచారాన్ని చీల్చి చండాడింది కూడా కేసీఆరే. ఒకనాటి హైదరాబాద్ రాష్ట్ర సిరిసంపదలు, వసతులు, వనరులు, వైభవాన్ని చరిత్రకారులు శోధించి వెలికితీయడం దానికి జత కూడింది. గొప్ప వారసత్వం ఉన్న జాతి జరిపిన ఏ పోరాటం విఫలమైన చరిత్ర లేదు. అది తెలంగాణలోనూ వాస్తవరూపం దాల్చింది. కేసీఆర్.. ఒక స్ఫూర్తి ప్రదాత!! గాంధీ మార్గంలోనే.. తెలంగాణ సాధనకు కేసీఆర్ నడిపిన ఉద్యమానికి స్వాతంత్య్రం కోసం గాంధీ నడిపిన ఉద్యమానికి అనేక పోలికలు కనిపిస్తాయి. రెండు ఉద్యమాల్లో ఎక్కడా ఏ దశలోనూ హింసకు తావునివ్వలేదు. అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా గాంధీ ఉద్యమం సాగితే, కేసీఆర్ అదే రీతిలో ఉద్యమాన్ని నడిపించారు. ఒక్క చుక్క నెత్తురు నేల రాలకూడదు అని జలదృశ్యంనాడు చెప్పిన మాట అక్షరాలా అమలు చేశారు. ఆ స్ఫూర్తినే ప్రజలు కూడా అందుకున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం, రాజకీయ పక్షాలు నాయకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా ఏ దశలోనూ ఏ ఒక్క సీమాంధ్రునిపై చేయి వేసిన సందర్భం లేదు. నిరాశ కమ్మిన వేళ తమను తాము దహించుకున్నారే తప్ప దాడులకు దిగలేదు. బతుకమ్మలాటలు...తెలంగాణ సంబురాలు..వంటా వార్పు వంటి కార్యక్రమాలు ప్రజాగ్రహాన్ని సాంస్కృతిక రూపంలో వెలువరించేందుకు ఉపకరించాయి. ఆగ్రహం స్థానంలో సంయమనాన్ని పాదుకొల్పాయి. హింసను ఆశ్రయించరాదన్న కేసీఆర్ ధృఢ సంకల్పం విజయం సాధించింది. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల పాలననుంచి నల్లజాతిని విముక్తి చేసిన నెల్సన్ మండేలా కూడా ఇక్కడ మనకు గుర్తుకొస్తారు. కేసీఆర్.. మొక్కవోని గాంధేయవాది!నిరాహార దీక్ష...కేసీఆర్ పాటించిన అహింస, అగ్ని పరీక్షలకు ఇది పతాక సన్నివేశం. ఫలితం దైవాధీనం.. కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియదు. పార్లమెంటులో బలం లేదు. అసెంబ్లీలోనూ బలం లేదు. కేవలం ప్రజాబలాన్ని నమ్ముకుని దీక్ష ప్రారంభించారు. ఎన్నో వ్యంగ్యాలు.. వక్రీకరణలు..అయినా చెక్కు చెదరలేదు. ఫలితం తెలంగాణ ప్రకటన సాధన. తెలంగాణ రాష్ర్టాన్ని అనివార్యం చేసిన చారిత్రక ఘటన అదే. ఆ తర్వాత కేంద్రం వెనక్కిపోయినా ముందుకు పోయినా తెలంగాణ ఆవిర్భావానికి పునాది అదే. ప్రజలకు కొండంత ధైర్యాన్ని, సాధించగలమనే నమ్మకాన్ని కల్పించిందీ కూడా అదే. ఆ తర్వాత జరిగిన పోరాటాలన్నీ దానికి అనుబంధ ఘటనలే! కేసీఆర్....చరిత్రకారుడు! జాతిపిత..2009లోనే తెలంగాణ ప్రకటన రాగానే జనమంతా పలికిన ఒకే ఒక్కమాట. తెలంగాణ జాతిపిత... అది ఏదో తెచ్చిపెట్టుకున్న మాట కాదు. ఈ జాతికి దాని గొప్పతనాన్ని నూరిపోసిన వాడు.. తెలుగు తల్లి వంటి మోహావేశ బంధనాలను బద్దలు కొట్టిన వాడు.. విముక్తి ప్రణాళిక రాసిన వాడు..కష్టంలో సాంత్వన పలికిన వాడు...యుద్ధంలో ముందు నిలిచినవాడు..వెన్నంటి ధైర్యం చెప్పిన వాడు.. పోరాడి విజయపతాక ఎగురవేసిన వాడు..కాబట్టే కేసీఆర్ నిస్సందేహంగా తెలంగాణ జాతిపిత!!! ఒక్క పిలుపుతో ...నేను ఒక్కటే మాట మనవి చేస్తున్న. పట్టుదలతోటి ఉన్నం కాబట్టే ఇయాల ఇక్కడిదాక మనం రాగలిగినం. కేంద్రం మంచిమాటతోని వస్తె వస్తది. రాకపోతె కచ్చితంగా మహోగ్రమైనటువంటి తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరుగుతది. దానికి మీకు ఎప్పటికప్పుడు సందేశం వస్తది. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అందరం కలిసి సత్యాగ్రహంనుంచి మొదలు పెడితే మహోగ్రరూపం దాల్చి పూర్తిగ ప్రభుత్వ పరిపాలనను కూడా స్తంభింప చేస్తం. భూకంపం పుట్టించి అయినా.. ఆకాశం బద్దలు కొైట్టెనా సరే.. తెలంగాణ రాష్ట్రం సాధించి తీరాలె. దాం ట్ల మాత్రమే మనకు విముక్తి ఉన్నది తప్ప ఇంక దేంట్ల లేదు. మన దారి మనం చూసుకోవాలె.. ఉద్యమం చేయాలె.. పోరాటాలు చెయ్యాలె.. త్యాగా లకు సిద్ధపడాలె.. తెలంగాణ తెచ్చుకోవాలె మన సకల సమస్యలకు దాంట్లోనే పరిష్కారం ఉంది.- 25 లక్షల మంది హాజరైన వరం గల్ మహాగర్జనలో కేసీఆర్ సందేశమిది. ఈ సభ ద్వారా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఎత్తు లోతు ప్రపంచానికి అర్థమైంది. భూగోళం మీద జరిగిన పది మహా ప్రదర్శనల్లో ఈ సభ చోటు చేసుకుంది. ఆ తర్వాత అంచెలంచలుగా ఉద్యమం నిర్మాణం జరగడం.. పతాక సన్నివేశంగా సకల జనుల సమ్మె ప్రభుత్వ స్తంభనకు దారితీసి ఇక తెలంగాణ ఇవ్వడం అనివార్యం అని కాంగ్రెస్ నిర్ణయానికి రావడం మనకు తెలుసు. కేసీఆర్.. ప్రజా ఉద్యమకారుడు!తనను తాను హింసించుకుని.. ఇక ఉద్యమం చల్లారుతున్న ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ టీఆర్‌ఎస్ ఉప ఎన్నికలు తెచ్చి అగ్నిపరీక్షలకు సిద్ధపడ్డారు. గాంధీ ఇలాంటి సందర్భాల్లో సత్యాగ్రహం, ఉపవాసాలతో ప్రజలతో చైతన్యం నింపేవారు. మారిన కాల పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ ఉప ఎన్నికల పరీక్షకు నిలిచారు. వాటి ద్వారానే తెలంగాణ వాదాన్ని ప్రకటించగలమని ఆయన విశ్వసించారు. ఒకటి రెండు సార్లు ఇబ్బంది పడ్డా అంతిమంగా తెలంగాణ ఉద్యమంలో ఉప ఎన్నికలే కీలక పాత్ర వహించి తెలంగాణ వాడిని వేడినీ చాటి చెప్పాయి. తొలిసారి 2006లో కేసీఆర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధపడడం ఒక సాహసం. వాస్తవానికి అప్పటి పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేవు. సీమాంధ్ర సీఎం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాగేసి పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నాడు. మరోవైపు అయిన వాళ్ల ఆరళ్లు. ఏం సాధించావనే సాధింపులు. పదవుల కోసం తెలంగాణ వదిలేశాడన్న అపనిందలు.. అన్నింటికీ కేసీఆర్ ఇచ్చిన ఏకైక జవాబు ఉప ఎన్నిక. తనను తాను ఫణంగా పెట్టడం..30 ఏండ్ల రాజకీయ జీవితాన్ని కూడా మొత్తంగా ఒడ్డడం ఇందులో అంశం. ఎందుకు ఎన్నిక అవసరమో ప్రజలకు వివరించారు. తెలంగాణకు ఇది రిఫరెండం అని ప్రకటించి ఘన విజయం సాధించారు. గాంధీ చేసిన ఉపవాసవ్రతంలాంటిదే ఇదికూడా. ఆ తర్వాత సాధారణ ఎన్నికలలోపలే మరో భారీ ఉప ఎన్నికల పర్వం. ఎదురుదెబ్బలు తాకినా లక్ష్యం నెరవేరింది. 2004లో కాంగ్రెస్‌తో కలిస్తే పడ్డ ఓట్లు ఎన్నో..టీఆర్‌ఎస్ సొంత ఓటు బ్యాంకు ఎంతో తేటతెల్లమైంది. ఆ ఓటు బ్యాంకు మీద ఆశ టీడీపీతో తెలంగాణ తీర్మానం చేయించింది. తెలంగాణకు శాశ్వతంగా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి కలిగించింది. తెలంగాణ ప్రకటన తర్వాత చేసిన రాజీనామాలు తద్వారా వచ్చిన ఉప ఎన్నికలు వాటిలో సాధించిన మెజారిటీ చరిత్రకే కొత్త భాష్యం చెప్పాయి. కొన్ని పార్టీల పతనానికి బీజం వేశాయి. నలుగురు నాయకులు.. మార్గం ఒకటే! స్వరాజ్య సాధన అంటే ఇతరులను చంపేసి సాధించడం కాదు. నిరంతర ఆత్మత్యాగాలతో కూడిన స్వచ్ఛంద ఉద్యమంతో సాధించేది. అహింస అనే ఆయుధంతోనే మనం పోరాడుతున్నాం.. పోరాడాలి కూడా. ఎందుకంటే మన దగ్గర సత్యం అనే దీక్ష ఉంది. సత్యాగ్రహం అనే మార్గం ఉంది - మహాత్మా గాంధీ మనం మొట్టమొదటగా చెబుతున్నది.. మనం అమెరికన్ పౌరులం.. అలాగే మనం హింసను ప్రోత్సహించం. అమెరికా ప్రజాస్వామ్యం ఇచ్చిన అత్యుద్భుత ఆయుధం ఆందోళన చేసే హక్కు. దాన్నే వినియోగించి జాత్యహంకారాన్ని బద్దలు కొడదాం. ఈ మార్గంలో మనం విజయం సాధిద్దాం మార్టిన్ లూథర్ కింగ్ మాంట్‌గోమరి ప్రసంగం...ఆత్మాహుతులు అహింసకు ప్రతిరూపాలే. తమను తాము దహించుకుంటున్న బౌద్ధ సన్యాసులు వాస్తవానికి ఆత్మాహుతి దళాలుగా మారిఉంటే వందల మంది శత్రువుల ప్రాణాలు పోయేవి. కానీ వాళ్లు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారే తప్ప ఇతరుల ప్రాణాలు తీయడంలేదు. అహింసా మార్గంలో ఇది పరమపవిత్ర ఆచరణ కేసీఆర్.....ఒక దార్శనికుడు! తెలంగాణ ఉద్యమం పూర్తిగా అహింసాపద్ధతిలోనే నిర్వహిస్తం. నెత్తురు చుక్క రాలనివ్వం. హింసాత్మక ఘటనలకు ఎవరు పాల్పడినా తీవ్రంగా వ్యతిరేకిస్తం. ఉద్యమం శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా సాగుతుంది. సంకీర్ణయుగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని పార్లమెంటులో సీట్లు సాధించడం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తం..

మరింత సమాచారం తెలుసుకోండి: