దేశవ్యాప్తంగా 11 రాష్త్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ రోజు రెండవ విడత పోలింగ్ జరుగుతోంది. యధాప్రకారం ఈవీఎంల మొరాయింపు చాలా చోట్ల జరిగింది. ఇక గొడవలు, ఉద్రిక్తతలు కూడా ఈసారి చోటు చేసుకున్నాయి. బెంగాల్, అస్సాం వంటి చోట్ల కొంత అలజడి చెలరేగింది.
లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారింది. రాయ్గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్పూర్ జిల్లా ఇస్లాంపూర్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. భద్రతా దళాలు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
అదే విధంగా ఇస్లాంపూర్లోని మరో పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ సీపీఎం అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. దాడి నుంచి సీపీఎం అభ్యర్థి సురక్షితంగా బయటపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.
ఇక అస్సాంలో కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలో ఈవీఎం లు మొరాయించాయి. దాంతో అక్కడ చాలా కేంద్రల్లో ఓటు వేయడం కోసం జనం ఎదురుచూస్తూ గడిపారు. ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీ లో అయితే తమకు సరైన వ్యవసాయ సదుపాయాలు కల్పించలేదని పేర్కొంటూ మంగోలికాలా గ్రామస్తులు పోలింగ్ను బహిష్కరించారు. ఇప్పటి వరకు ఒక్క ఓటు కూడా అక్కడ పోల్ అవలేదని చెప్పని ఎన్నికల సిబ్బంది పేర్కొన్నారు. కాశ్మీర్లో పోలింగ్ మందకొడిగా సాగింది. మొత్తం మీద చూసుకుంటే రెండవ విడతలో ప్రసాంతంగానే పోలింగ్ జరిగిందని భావిస్తున్నారు.