సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అభంశుభం తెలియని చిన్నారులను మద్యం మత్తులో ఓ తండ్రి బలితీసుకున్నాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దుబ్బాక మండలంలో ఈ ఘటన జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం లచ్చపేటలో బడుగు రాజేందర్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అయితే ఏడాది క్రితం అతడి భార్య మరణించింది. ఇద్దరు కూతుళ్లు భవాని, లక్ష్మీతో కలిసి ఉంటున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ గత రాత్రి మద్యం మత్తులో తన ఇద్దరు కూతుళ్ల గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత తాను ఉరేసుకున్నాడు.
ఇది గమణించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.