ఏపిలో ఎన్నికల ఫలితాలపై ఎన్నో సర్వేలు వచ్చాయి..ఆ సర్వేలు టీడీపీ కి పాజిటీవ్ గా వచ్చాయి..కొన్ని సర్వేలు వైసీపీ పాజిటీవ్ గా వచ్చాయి. కానీ ఈ నెల 23న వెలువడిన ఫలితాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అన్ని సర్వేలు తలకిందులు చేస్తూ..175 కి 150 సీట్లు కైవసం చేసుకుంది. కేవలం 23 సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అయ్యింది. అయితే ఎన్నికల ఫలితాలపై టీడీపీ పోస్టుమార్టం చేయడం మొదలు పెట్టింది. ఎక్కడ లోపాలు జరిగాయి..ఎందుకు ఈ దారుణమైన ఓటమి చవిచూసిందని పార్టీ శ్రేణులు ఆలోచనలో పడ్డాయి.
కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ పడిన గంటా శ్రీనివాస్ రావు ఓట్ల లెక్కింపు వేళ నెలకొన్న సందిగ్ధతతో ఎంతో ఉత్కంఠతో గడపాల్సి వచ్చింది. తెల్లవారి గానీ రిజల్ట్ రాలేదు..అప్పటి వరకు తెలుగు దేశం పార్టీలో రక రకాల అంచనాలతో సతమతమయ్యారు. చివరకు విజయం ఆయన్నే వరించగా, విశాఖలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించిన నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని, అయినా ప్రజలు మార్పు కోరుకున్నారని అన్నారు.
అయితే ఏపిలో ప్రజలు జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకు పోయిందని.. అందువల్లే ఇంత ఘన విజయం ఆ పార్టీకి సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. 29వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుందని, దానిలో టీడీపీ ఘోర పరాజయంపై లోతైన విశ్లేషణ జరుగుతుందని చెప్పారు.