సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తొలి క్యాబినేట్ సమావేశం ముందు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో రాష్ట్రంలో తల్లిదండ్రులకు భారంగా మారిన ప్రైవేటు కార్పొరేట్‌ కాలేజీలు, స్కూళ్ల ఫీజులను నియంత్రించేందుకు ‘రెగ్యులేటరీ కమిషన్‌’ను ఏర్పాటు చేయనున్నామని  మంత్రి సురేష్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని తెలిపారు.

విద్యను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని బాలబాలికల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ స్కూళ్లలో చేరేందుకు అనువుగా వాటిని మరింత బలోపేతం చేయనున్నామని వివరించారు. విద్యా శాఖ మంత్రిగా శనివారం ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆ వెంటనే శాఖకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు చేపట్టారు. సోమవారం కేబినెట్‌ సమావేశం జరగనున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష చేశారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను, ఎన్నికల మేనిఫెస్టోను తప్పక అమలు చేయడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. చదువులు పేదలపై భారంగా మారరాదన్నారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్‌ వేయడంతో పాటు అర్హులైన పేదలందరినీ ‘అమ్మ ఒడి’ ద్వారా ప్రభుత్వం ఆదుకొంటుందన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. మాతృభాష తెలుగుకు ప్రాధాన్యతనిస్తూనే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని వివరించారు. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం ద్వారా ప్లిల్లల చేరికలు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఈ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంత్రి పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: