ఏపీ ముఖ్యమంత్రి హోదాలో...టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏలుబడిలోని అవకతవకలు, ఏపీ ప్రరయోజనాలకు వ్యతిరేకమైన నిర్ణయాల పరంపరలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 67% పెరిగినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏపీ బడ్జెట్ లెక్కల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ ఆంధ్రప్రదేశ్పై రూ.2,49,435 కోట్ల రుణభారం ఉందని వెల్లడించారు. 2015 మార్చి నెలాఖరు దాకా రాష్ట్రంపై రూ.1,48,743 కోట్ల అప్పులు ఉండగా... 2017 మార్చి నెలాఖరుకు ఇది రూ.2,01,314 కోట్లకు చేరిందని, ఈ కాలంలో 35శాతం అప్పులు పెరిగాయని వివరించారు.రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆమె లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి ఈ వివరాలను వెల్లడించారు.
డిస్కమ్ల అప్పులను టేకోవర్ చేయడానికి వీలుగా ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి ఒకసారి అప్పులు తీసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతించామని, అందులో ఉదయ్ పథకం కింద 2016-17లో రూ.8256 కోట్ల అదనపు రుణం తీసుకోడానికి ఆంధ్రప్రదేశ్కు అనుమతించామని స్పష్టం చేశారు. 2016-17లో రెవెన్యూ లోటు కింద రూ.1176.5 కోట్లు, వెనుకబడిన జిల్లాల కోసం రూ.350కోట్లు, రాజధాని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రూ.450కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2514.7 కోట్లు విడుదల చేశామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు 2017-18లో రూ.2వేల కోట్లు, 2018-19లో రూ.1400 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ప్రత్యేక ఆర్థిక చర్యల్లో భాగంగా 2015-20 మధ్య విదేశీ సహకారంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలు, వడ్డీ చెల్లింపునకు 2018-19లో రూ.15.81 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.
ఇవి కాకుండా ఆయా పథకాలు, నిధుల వితరణ కింద 2016-17లో రూ.10,169.2 కోట్లు, 2017-18లో రూ.20,505.72 కోట్లు, 2018-19లో రూ.19,698.01 కోట్లు రాష్ట్రానికి బదలాయించామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ పద్దులు, ఆడిట్ ఖాతాల ప్రకారం గత మూడేళ్లలో ఏపీ రుణాలు, వాటిపై చెల్లించే వడ్డీలకు సంబంధించి రుణవృద్ధి 2015-16తో పోలిస్తే 2016-17నాటికి 35% పెరగ్గా, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆ వృద్ధిరేటు 11%, 10%కి పరిమితమైంది.