పదేళ్ళ పాటు పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశాలు దక్కడంలేదని, నిన్న కాక మొన్న చేరిన వారికే అందలాలు అందిస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ నేతలు గోడుమంటున్నారు.  అసలైన వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు తీరని అన్యాయం జరుగుతోందని రగిలిపోతున్నారు.  తాము తొమ్మిదేళ్ళ పాటు అష్టకష్టాలు పడి పార్టీకి పనిచేస్తే పక్కన పెట్టి మరీ ఫిరాయించి వచ్చిన నాయకులకు పదవులు ఇవ్వడమేంటని వారంతా ఆవేదన చెందుతున్నారు. 


జగన్ కాంగ్రెస్ ని వీడివచ్చినపుడు వెంట ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదని కూడా గుర్తు చేస్తున్నారు. నాడు అధికారం అనుభవించిన వారికే ఇపుడు జగన్ పెద్ద పీట వేయడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ ఏరి కోరి తన క్యాబినెట్లోకి తీసుకున్న అవంతి శ్రీనివాసరావు  ఎన్నికల ముందు వైసీపీలో చేరి భీమిలీ టికెట్ తెచ్చుకున్నారు. గెలవడం తోనే మంత్రి అయిపోయారు. ఆయన ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీలో చేరి అధికారాన్ని అనుభవించి వచ్చిన వారు. ఇపుడు వైసీపీలో మంత్రిగా అధికారం అనుభవిస్తున్నారు. ఇదే ఇపుడు అసలైన వైసీపీ నేతలకు కడుపు మంటగా ఉంది.


ఇక ఉత్తరాంధ్రాలోనే తొలి నామినేటెడ్ పదవిని జగన్ ద్రోణం రాజు శ్రీనివాస్ కి ఇచ్చారు. ఆయన కూడా ఎన్నికల ముందే వైసీపీలో చేరారు. అంతకు ముందు కాంగ్రెస్ లో ఉండి జగన్ని విమర్శించేవారని నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇక అయనకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓటమి పాలు అయ్యారు. అయినా  కూడా ఆయన్ని పిలిచి మరీ అతి పెద్ద పొస్ట్ జగన్ ఇవ్వడంతో వైసీపీ నేతల ఆగ్రహం అంతా ఇంతా కాదు,

తాము జగన్ వెంట నడిచి కష్టాలు, నష్టాలు పడ్డామని, ఇంతా చేస్తే కాని వాళ్ళమైపోయమా అని ఆవేదన చెందుతున్నారు. జగన్ నిజమైన పార్టీ వారికి న్యాయం చేయకుండా రెడీ మేడ్ నేతలకు పదవులు ఇవ్వడమేంటని కూడా గుస్సా అవుతున్నారు. మరి జగన్ వీరి బాధలను తెలుసుకుని అసలైన క్యాడర్ కి, లీడర్ కి న్యాయం చేస్తారా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: