ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం నవ్యాంధ్య రాజధాని శంకుస్థాపన చుట్టు తిరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాలు దాదాపుగా మొదలయ్యాయి. ఇకపోతే.. దేశం నుంచే కాకుండా వివిధ దేశాలను వివిఐపీ లకు ఆహ్వానించడం పూర్తి చేసుకున్నారు. దేశ ప్రధాని నుంచి రాష్ట్రపతి, కేంద్రమంత్రులు, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అయితే పక్క రాష్ట్రమైన తెలంగాణ కు ఆహ్వానం ఇంకా అందలేదు. ఒకవేళ అందినా.. తెలంగాణ సీఎం కేసీఆర్ వస్తారా రారా అన్న సందిగ్దత మాత్రం ఉంది. ఇది ఇలాఉంటే.. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం వచ్చినా రాకపోయినా ఆయనకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ ఏపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాకుంటే మాత్రం కొంత వెలితిగానే ఉంటుంది. ఇకపోతే జగన్ హాజరు కాకుంటే నష్టం ఎవరికి అన్నది ఇప్పుడు కీలక చర్చ గా మారింది.
జగన్ పార్టీలోని కీలక నేతలు అందరితోనూ ఒక సమావేశం
తను ఒక నిర్ణయం తీసుకునే ముందు జగన్ పార్టీలోని కీలక నేతలు అందరితోనూ ఒక సమావేశం నిర్వహించుకుంటారు, కానీ.. ఆ సమావేశంలో తనకంటె పెద్దవాళ్లు చిన్న వాళ్లు అందరూ కూడా మూకుమ్మడిగా మీ ఇష్టం సార్.. మీ ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుందాం అని చెప్పాలని, సకల నిర్ణయాధికారాన్ని తన చేతిలో పెట్టాలని ఆయన ఆశిస్తారు. వయస్సులో తన తండ్రిని మించిన వారైనా సరే.. తనను సార్ అని పిలవాలని కోరుకునే మనసత్తత్వం జగన్ ది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి నాయకుల అభిప్రాయాలకు విలువ ఇస్తారనుకోవడం కల్ల. అలాగే ఆయన అమరావతి శంకుస్థాపనకు హాజరు కాకూడదంటూ ఇవాళ తీసుకున్న నిర్ణయం కూడా ఒంటెత్తు పోకడేనని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. శంకుస్థాపన కార్యక్రమానికి తాము డుమ్మా కొడితే.. దాని వల్ల ప్రజల్లోకి భిన్నమైన సంకేతాలు వెళతాయని.. పలువురు వైకాపా నాయకులు తమలో తాము అనుకుంటున్నారు.
ఇప్పటికే అభివృద్ధిని చూసి సహించలేకపోతున్నాం అని అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అని తమ మీద బోలెడు నిందలు పడుతున్నాయని, కొత్తగా కనీసం శంకుస్థాపనను చూసి ఓర్చుకొలేకపోతున్నారనే నింద కూడా పడాల్సి వస్తుందని వారంటున్నారు. నిజానికి జగన్ గురువారం నాడు తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నాయకుల సమావేశంలో కొందరు పెద్దలు ఈ విషయాన్ని జగన్ కు తెలియజేప్పే ప్రయత్నం కూడా చేశారట. అయితే జగన్ మాత్రం పట్టించుకోలేదని సమాచారం. కార్యక్రమానికి వెళ్లకపోతే.. పార్టీకి చెడ్డపేరు తప్పదని, జగన్ మాటకు ఇక పార్టీ లో తిరుగులేదు కనుక తాము అన్నింటికి సిద్దపడే ఉండాల్సిందేనని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు!. ఇకపోతే.. రాజధాని అమరావతి శంకుస్థాపనకు అందరినీ ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమవుతుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్ మాత్రం ఆ ఆహ్వానం తనకు పంపించొద్దని , ఒకవేళ పంపించినా తాను రానని తెగేసి చెప్పేశారు.
''నాకు ఇన్విటేషన్ పంపించొద్దు... ఇచ్చినా నేను రాలేను.. ఆ తరువాత మళ్లీ నన్ను అనొదు అంటూ జగన్ గురువారం ఏపీ సీఎం చంద్రబాబు కు బహిరంగా లేఖ రాశారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను ఎందుకు హాజరు కావడం లేదో వివరించారు. అందుకు జగన్ 8 కారణాలు చెప్పారు. ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రైతుల భూములు లాక్కొని రాజధాని కడుతున్నారు. మూడు పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట రైతుల మెడ మీద కత్తి పెట్టి లాక్కున్న చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే మేం పలు సందర్భాలలో దీక్షలు చేసినా నిరసనలు తెలిపినా తీరు మారలేదు. అందుకే రాదల్చుకోలేదని ఆ లేఖలో రాశారు.
అంతేకాకుండా అధికార టీడీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. నచ్చిన ప్రయివేటు విదేశీ సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చినట్లు భూములు ఇస్తున్న మీ వైఖరికి నిరసనగా మీరు చేస్తున్న ఈ స్కాంలో మీకు మద్దతు తెలపకూడదన్న భావనతో రాదల్చుకోలేదు.
కేంద్రం రూ.1850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రింగ్ రోడ్డు ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ఏపీకి ఇంకా చేస్తామని కూడా చెబుతోంది. ఈ డబ్బును ఖర్చు చేసి బిల్లులు పెట్టండి. మీ వాళ్లను బినామీలుగా పెట్టుకొని రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలను కొనుగోలు చేయించి వారి భూములు వదిలేసి పేదల భూములు మాత్రం ఇష్టం లేకపోయినా లాక్కొన్న మీ వైఖరికి నిరసనగా మేం రాదల్చుకోలేదు. ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు ప్రజల డబ్బు దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్న మీ తీరుకు నిరసనగా రాదల్చుకోలేదు. అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. రాజధాని శంకుస్థాపనకు పలిచినా రానని అలాంటప్పుడు తన పైన మంత్రులతో విమర్శలు చేయించవద్దని లేఖలో పేర్కొన్నారు. లోటస్ పాండ్ నుంచి ఫ్యాక్స్ ద్వారా జగన్ చంద్రబాబు పంపారు. దాదాపుగా ఈ లేఖ చంద్రబాబు అంది ఉంటుంది.
అయితే.. ఈ విషయంలో చంద్రబాబు ఏలాంటి నిర్ణయం తీసుకున్నా.. ప్రతిపక్ష నాయకుడు తీసుకున్న నిర్ణయంతో ఏపీ ప్రజల్లో కొంత వరకు వ్యతిరేకత పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఏపీ కి రాజధాని లేని పరిస్థితి కొత్త నిర్మించ తలపెట్టిన రాజధానిలో అధికార పార్టీ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను ఎండగట్టే సర్వ అధికారాలు వైకాపా కు ఉన్నాయి. కాకపోతే.. రాజధాని శంకుస్థాపన విషయంలో ఖచ్చితంగా వెళితేనే బాగుంటుందన్న వాదన బలపడుతుంది. అలా వెళకపోతే జగన్ పార్టీ కే తీవ్ర నష్టం జరగకతప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ వ్యవహారంతో ఎవరికి నష్టం ఎవరికి లాభం అన్నది సమయమే సమాదానం చెబుతుంది.