ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇద్దరు యువ నాయకుల సత్తా చూపించేందుకు సమయం ఆసన్నమైంది. రాష్ట్ర విభజనానంతరం మొట్టమొదటి సారిగా ఏపీలో 12 కార్పొరేషన్, మున్సిఫల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇప్పుడు తమ సత్తాకు పరీక్షించుకునేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ లు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల్లోకి వచ్చారు. ఇక లోకేష్ తన తండ్రి సీఎం అయిన తరువాత రాజకీయాల్లోకి ఎంటరిచ్చారు. మరి కొన్ని రోజుల్లో బాబు క్యాబినేట్ లో మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో నారా లోకేష్ గ్రేటర్ ఎన్నికల ప్రచార బాద్యతలు తీసుకుని ఘోర పరాభవం చవి చూశారు. మరోవైపు జగన్ గత సార్వత్రిక ఎన్నికల్లోకి వెళ్లి తన బలం నిరూపించుకున్నారు. దాదాపు గెలుపు తీరాలను తాకి వెనక్కువచ్చి, ప్రదాన ప్రతిపక్ష పార్టీ గా ఉన్నారు.
ఇద్దరు యువ నాయకుల సత్తా చూపించేందుకు సమయం
అయితే తాజాగా వైకాపా నేత పార్టీ నేతలు ఒకరి వెనుక ఒకరు అధికార టీడీపీ లోకి జంప్ అవుతున్నారు. అంటే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ సమయంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో జగన్ పార్టీని గెలిపించుకుంటారా? అన్న రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వారిలో మొదటి నేత జగన్ కాగా, రెండో నేత లోకేష్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సారథ్యం వహించి, పార్టీని గెలిపించుకోలేని విఫల నేతగా ముద్రపడిన లోకేష్, ఈ సారి సొంత రాష్ట్రంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తన సత్తా ఏ సత్తా ఏ స్థాయిలో చూపిస్తారోనన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కర్నూలు, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, రాజంపేట, కాకినాడ, ఒంగోలు, విజయనగరం, తిరుపతి కార్పోరేషన్లతో పాటు, బేతంచర్ల, కందుకూరు, రాజాం మున్పిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వాటి కోసం తెలుగుదేశం పార్టీ ముందుస్తు సన్నాహాల్లో ఉంది.
ప్రధాన కార్యదర్శి లోకేష్, వైసీపీ కి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్
ఈ నెల 22న ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన నాయకులతో లోకేష్ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, ఈ స్థానిక సంస్థలకు రెండు పార్టీలకు ఇద్దరు యువనేలు సారథ్యం వహించనున్నారు. టీడీపీ కి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, వైసీపీ కి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వం వహించనున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా స్థానిక సంస్థలకు జరగనున్న ఎన్నికల కావడంతో, ఇద్దరి సత్తా ఎంత అన్నది ఫలితాలు తేల్చనున్నాయి. ముఖ్యంగా లోకేష్ సారధ్యంపైనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో అభ్యర్దుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అంతా ఆయనే భుజాన వేసుకున్నారు. విస్తృతంగా తిరిగారు. ఆ సందర్భంలో గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్ - లోకేష్ సత్తా కు వేదికగా నిలిచాయి. మీడియా కూడా ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత? ఎవరు సక్సెస్ అవుతారని ప్రచారం చేశాయి. చివరకు టీడీపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కగా, టీఆర్ఎస్ కార్పొరేషన్ దక్కించుకుంది. ఫలితంగా కేటీఆర్ సక్సెస్ ఫుల్ నేతగా, లోకేష్ ను ఫెయిల్యూర్ నేతగా మీడియా అభివర్ణించిన విషయం అందరికి తెలిసిందే.
పైగా లోకేష్ తెలంగాణకు ఇన్ చార్జీ గా వ్యవహరిస్తున్న సమయంలోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లోకి చేరిపోవడంతో, ఆయన నాయకత్వ ప్రతిభపై అప్పట్లోనే విమర్శలోచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు లోకేష్ స్వరాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తొలిసారి సారథ్యం వహించనున్నారు. అందుకే ఆ ఎన్నికల్లో లోకేష్ సత్తా చూపిస్తారా? లేదా? అన్న అంశం పై చర్చ జరుగుతోంది. ఇక జగన్ ఇప్పటికే తన సారథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లి, 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపాలిటీ , స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన పార్టీకి సారథ్యం వహించారు. అయితే, పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వీడిపోతున్న ఈ సంక్షోభ సమయంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పార్టీని ఎలా నడిపిస్తారన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ మున్సిపాలిటీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ యంత్రాంగం లేదు. కమిటీలు లేవు. బూత్ కమిటీలు అసలే లేవు. ఈ నేపథ్యంలో వైకాపా స్థానిక సంస్థల్లో విజయం సాధించకపోతే, జగన్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న సంకేతాలు జనంలోకి వెళతాయి.
జగన్ తరువాత ఇప్పుడు ఒక లోకేష్ వంతు వచ్చింది. తన పార్టీకి అన్ని చోట్లా గెలిపించి, గ్రేటర్ ఎన్నికల్లో తనపై పడిన విఫలనేత అన్న ముద్రను పోగొట్టుకుంటారా? లేక అదే ముద్రను కొనసాగించుకుంటారా? అన్నది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. మెజారిటీ స్థానాలు సాధించకపోతే లోకేష్ నాయకత్వం పై మరిన్ని విమర్శలు పెరిగి, అది చివరకు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆటంకంగా కూడా మారే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ తో పొత్తును కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. గుంటూరు, విశాఖ, తిరుపతి కార్పొరేషన్లలో ఆ పార్టీ కి బలమైన నాయకులు, క్యాడర్ ఉంది. విశాఖ లో కొన్నేళ్ల క్రితమే బీజేపీ మేయర్ సీటు సాధించగా, ప్రస్తుతం అక్కడ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక గుంటూరు లో బలమైన నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీని ఒంటిచేత్తో గెలిపించారు. ఆయన కుమారుడు నాగరాజు మేయర్ గా కూడా గెలిచారు. కాకినాడ లో సోము వీర్రాజు ప్రభావం ఉంటుంది. రాజమండ్రి లో ఎమ్మెల్యే కూడా ఉన్నారు.
ఒంగోలు లో కూడా బీజేపీ కి చెప్పుకోదగిన బలం ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ బీజేపీ తో ఎంతవరకూ సర్ధుబాటు చేసుకుని, ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తారన్న చర్చ జరుగుతోంది. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం కాస్తా మందకొడిగానే ఉంది. ఒకరి తరువాత ఒకరు పార్టీని వీడి సైకిలేక్కెస్తున్నారు. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టతరంగానే ఉంది. పార్టీని తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి జగన్ సన్నాహాలు మొదలు పెట్టారు. కానీ... జగన్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో అధికార టీడీపీ అడుగులు వేస్తోంది. మరి ఈ క్రమంలో రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి. ఎదేమైనా...ఈ ఎన్నికలు జగన్- లోకేష్ సత్తా ను చాటే వేదికలు గానే చెప్పాలి.