పన్నీర్ సెల్వం తిరుగుబాటు వెనక బీజేపీ హస్తం ఉందా..? అన్నీ సమకూరుస్తామని కమలం పార్టీ పన్నీర్ సెల్వంకు భరోసా ఇచ్చిందా..? పన్నీర్కే పట్టం కడతామని ఆశ చూపించి చివరకు హ్యాండిచ్చిందా..? ప్రస్తుతం మలుపులు తిరిగిన తమిళ రాజకీయాల ముఖచిత్రం పరిశీలించిన వారికెవరికైనా ఇది తొందరగా బోధపడుతుంది.
అమ్మ మరణం తరువాత అనూహ్యంగా మలుపులు తిరిగాయి తమిళ రాజకీయాలు. పన్నీర్ సెల్వం వెంటనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆ తర్వాత చిన్నమ్మను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం కొద్దిరోజుల్లోనే ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. చిన్నమ్మ సీఎం కావాలంటూ పన్నీర్ సెల్వమే స్వయంగా ప్రతిపాదించారు. అంతా రెడీ అనుకున్న సమయంలో అమ్మ ఆత్మ తనను నడిపిస్తోందంటూ జయలలిత సమాధి వద్ద అరగంటకు పైగా ధ్యానంలో గడిపిన పన్నీర్ సెల్వం చిన్నమ్మపైనే తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో తమిళనాడులో రాజకీయసంక్షోభం తలెత్తింది. అంత వరకు ఎన్నడూ మాట్లాడని అమ్మ ఆత్మ ఆరోజే పన్నీర్తో మాట్లాడటం చూస్తే దీనివెనక కచ్చితంగా బీజేపీ స్కెచ్ ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం నుంచి భరోసా రాకపోతే పన్నీర్ సెల్వం ఇంతకు తెగించేవాడు కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయిన శశికళ కలను కల్ల చేస్తూ అప్పుడే తెరమీదకు అక్రమాస్తుల కేసు రావడం చూస్తే ఇది కచ్చితంగా కమలం పార్టీ ఆడిన మైండ్ గేమ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. చిన్నమ్మకు సీఎం అయ్యేందుకు కావాల్సిన మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానించకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. అయితే ఎమ్మెల్యేలను అందరినీ గోల్డెన్ బే రిసార్ట్కు తరలించడంతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కుర్చీ కోసం కీచులాట ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి పన్నీర్ సెల్వంకు రోజు రోజుకు ప్రజల నుంచి మద్దతు పెరగడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కూడా పొందుతూ వచ్చారు.
రోజులు గడుస్తున్నప్పటికీ శశికళ వర్గం నుంచి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు గోడ దూకి పన్నీర్ సెల్వం వర్గంలో చేరినప్పటికీ పూర్తి స్థాయిలో రాలేకపోయారు. అంతా చిన్నమ్మనే అంటిపెట్టుకుని ఉండటంతో గవర్నర్పై కూడా పలు విమర్శలు వచ్చాయి. మద్దుతు ఉన్నప్పటికీ గవర్నర్ శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంతో ఆయనపై ఒత్తిడి ఎక్కువైంది. ఎట్టకేలకు చిన్నమ్మ జైలుకు వెళ్లాల్సిందేనంటూ సుప్రీం తీర్పు వెలువడటంతో అనూహ్యంగా తెరపైకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనీస్వామి వచ్చారు. చిన్నమ్మ జైలుకు పోతే ఎమ్మెల్యేలు కచ్చితంగా పన్నీర్ వర్గం వైపు వస్తారని భావించిన కమలం పార్టీకి భంగపాటే ఎదురైంది. ఇక చేసేదేమీ లేక గవర్నర్ పళనీస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం జరిగింది. బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు గవర్నర్. ఈ సమయంలో ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదు.
శశికళ వర్గపు ఎమ్మెల్యేలు పదిరోజులు గడుస్తున్నప్పటికీ పన్నీర్ వైపునకు రాకపోవడంతో బీజేపీ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉన్నందున బీజేపీ నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థికి తమిళనాడు ఎమ్మెల్యేలు ఎంపీల మద్దతు తప్పని సరిగా కావాల్సిందే. అయితే పన్నీర్ వర్గమైతే తాము చెప్పినట్లు వింటుందనుకున్న కమలం పార్టీ పన్నీర్నే గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా ఓటమి పాలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఒకవేళ రాష్ట్రపతి పాలన ఆ రాష్ట్రంలో విధిస్తే ఎన్నికలు జరిగేందుకు కనీసం 6 నెలల సమయం పడుతుంది. ఈ లోగ రాష్ట్రపతి ఎన్నికలు జరిగిపోతాయి. రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రభుత్వం రద్దవుతుంది కనుక వారి మద్దతు పొందే అవకాశం లేదు. దీంతో పత్రిపక్షాలు నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థి నెగ్గే అవకాశం ఉంది. అందుకే శశికళ వర్గం వైపే బీజేపీ మొగ్గు చూపి పన్నీర్ సెల్వంను రాజకీయంగా బలిపశువును చేశారనే అభిప్రాయాన్ని పొలటికల్ అనలిస్ట్లు విశ్లేషిస్తున్నారు. మరోవైపు తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ను రాజకీయాల్లో తీసుకొచ్చి తమిళనాడులో కమలం పార్టీ పాగా వేయాలని కూడా చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.