ఏపీ లో ఒక్కొక్కసారి తెలుగుదేశం తీరు చూస్తే భలే వింతగా అనిపిస్తుంది. ఎన్నికల ముందర ఇచ్చిన హామీలు నెరవేర్చే నాయకుడి సరిగ్గా కనపడడు కానీ ఎన్నికల ముందర , తరవాత సొంత పార్టీ నేతలకు ఇచ్చిన హమీలని ఎట్టిపరిస్థితి లో తూచా తప్పకుండా పాటించాలి అని అధినేత దగ్గర నుంచీ చిన్నా చితకా నాయకుల వరకూ గట్టిగా నమ్ముతారు. పైగా పార్టీ ఫిరాయింపు నేతలకీ , జంపింగ్ రాయుళ్ళ కీ ఈ బెనిఫిట్ లు ఎక్కువ. ఏదేమైనా పార్టీ ని అంటిపెట్టుకున్న వారికీ , గోడ దూకిన వారికీ కొన్ని హామీలు ఇచ్చిందట టీడీపీ పార్టీ.
వారికి ఇచ్చిన హామీలు గడిచిన మూడేళ్ళ సమయం లో బాగానే అమలు చేసింది అంటున్నారు కూడా.రాజకీయ అవసరాల కోసం ముఖ్యంగా పోలీసు శాఖని టీడీపీ సర్కారు ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటోంది అంటూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులపై ఉన్న కేసులను ఒక్కోటిగా కొట్టేసేలా ఆదేశాలు జారీచేసిన తీరు చర్చనీయాంశంగా మారుతోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మీద ఉన్న కొన్ని కేసులని టీడీపీ స్వయంగా రంగంలోకి దిగి పోలీసులతో మాట్లాడి మరీ కొట్టేసేలా చేసింది అంటున్నారు. అశోక్ రెడ్డి ఫిరాయింపు నేత , వైకపా టికెట్టు మీద ఆయన గెలిచారు. ఆ తరవాత కాలం లో టీడీపీ కి ఆకర్షితులు అయ్యారు.
వైకాపా టైం లో టీడీపీ ప్రభుత్వమే స్వయంగా కేసులు పెడుతోంది అంటూ ఎన్నోసార్లు మీడియా కి ఎక్కారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కేసుల్లో తనను ఇరికించారనీ, ఇదంతా టీడీపీ కుట్ర అని అప్పట్లో అంటుండేవారు. అయితే, కేసులు పెట్టగలిగినవారు మాత్రమే వాటిని తీయించగలరు అని భావించారో ఏమో తెలీదుగానీ.. అశోక్ రెడ్డి తెలుగుదేశంలోకి చేరిపోయారు. ఇంకేముంది… వడ్డించేవారు మనవారు, తాజాగా ఒక జీవోని వడ్డించేశారు! ఆయనపై ఉన్న కేసుల్ని ఎత్తివేస్తూ ఒక జీవో విడుదలైంది.
సో… దీంతో ఆయన కేసులు మాఫ్ అయిపోయాయి! అయితే, ఇది ఒక్క అశోక్ రెడ్డి విషయంలో జరిగి ఉంటే చూసీచూడనట్టుగా సర్దుకుని పోవచ్చు. కానీ, ఇదే క్రమంలో గతంలో కూడా ప్రముఖ నేతలకు కేసు మాఫీ ప్రకటించారు! మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావులపై ఉన్న కేసుల్ని కూడా ఇలానే జీవో తీసుకొచ్చి కొట్టేశారు. కోడెల శివప్రసాదరావు కూడా ఈ మార్గంలోనే కేసు మాఫీ పొందారు! కరెక్ట్ గా చెప్పాలంటే తెలుగుదేశం మూడేళ్ల పాలనలో ఈ తరహాలు జీవోలు 132 వచ్చాయని ఓ కథనం! సో… ఇక అంకెలు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మాటల్తో పనేముంది చెప్పండి.