మూడురోజులుగా ప్రపంచవ్యాప్తంగా వన్నా క్రై అనే ర్యాన్సమ్వేర్ కంప్యూటర్లకు వ్యాపిస్తూ ఆన్లైన్లో విధ్వంసం సృష్టిస్తుండడం తెలిసిందే. ఈ వైరస్ సోకిన కంప్యూటర్లు పనిచేయడం మానేస్తాయి. అందులోని సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. హ్యాకర్లు డిమాండ్ చేసినంత డబ్బు చెల్లిస్తేగానీ కంప్యూటర్ మళ్లీ పనిచేయదు. ఏటీఎంలలో పాతతరం విండోస్ ఎక్స్ పీ సాఫ్ట్ వేర్ వాడుతుండడంతో ముందు జాగ్రత్తగా వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలను మూసేశారు.
నిన్నటికే ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలు మూతపడగా, నేడు ప్రభుత్వ బ్యాంకులు కూడా మూసేయిస్తున్న ఏటీఎంల జాబితాలో చేరాయి. దీంతో బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాల్లో పలువురు డిజిటల్ సేవలను వినియోగించుకుంటుండగా, సాధారణ ప్రజానీకం మాత్రం నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమవారం దేశంలో 70 శాతం వరకు ఏటీఎంలను మూసేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. సోమవారం హ్యాకర్లు మరింత భీకరంగా దాడులు చేయొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఆర్బీఐ.. కేంద్ర హోం శాఖ, సెర్ట్—ఇన్లు బ్యాంకులకు పలు ఆదేశాలు జారీ చేశాయి. తాజా సైబర్ దాడి వల్ల దేశంలో పెద్దగా హ్యాకింగ్ ఘటనలు నమోదు కాలేదు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో రాన్సమ్వేర్ ప్రభావం కనిపించలేదు. ఈ సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేశంపై వాన్నా క్రై ప్రభావం ఏమీ లేదని తెలిపారు. దేశంలోని సైబర్ సెక్యురిటీ సంస్థలు, శాఖలు రాన్సమ్వేర్పై నిరంతరం నిఘా ఉంచి.. ఎప్పటికిప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయని వివరించారు.