వైకాపా అధినేత జగన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని కళలు కంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ఆయన తన పార్టీ సలహాదారుడిగా ఎన్నికల వ్యూహ కర్త, సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ ను నియమించారు. అయితే పార్టీ కార్యకర్తల్లో, స్థానిక నాయకుల్లో ఇప్పుడు కొత్త కలవరం మొదలయింది. అదేంటంటే.. ప్రస్తుతం నియోజక వర్గాల్లో, జిల్లాల్లో కొనసాగుతున్న పార్టీ కన్వీనర్లు, స్థానిక ఇంచార్జుల పోస్టులు ఉంటాయా..? లేక పీకేస్తారా..? అన్న సందేహం పార్టీ నాయకుల్లో మొదలయింది.
ప్రస్తుతం తదితర స్థానాల్లో కొనసాగుతున్న ఇంచార్జులు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యే అధికం. అయితే పార్టీ రాజకీయ వ్యవహారాల వ్యూహకర్త ప్రశాంత్కిషోర్ గెలవగలిగిన వారికే టికెట్ అంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఉన్న పదవి కాస్తా ఊడితే రాబోయే కాలంలో తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం వారిలో మొదలయింది. అసలు పార్టీలో తమ స్థానం చివరి వరకు పదిలమేనా అనే సందేహం అందరిలోనూ కొట్టొచ్చినట్ట కనిపిస్తోంది.
వీరిలో కొందరు 2014 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారూ ఉన్నారు. 2019 ఎన్నికల్లో తమకు డోకా లేదనే ధీమాతో మరికొందరు ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు తమకు అత్యంత సన్నిహితుడని చెప్పుకుని తిరిగేవారు మరికొందరు. మరి వీరందరి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేతుల్లో ఉంది.